30-05-2025 01:46:22 AM
ఫోన్ట్యాపింగ్ కేసు
తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 29: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి, ఎస్ఐ బీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ కోసం సుప్రీంలో పిటిషన్ వేయగా గురువారం విచారణ జరిగింది. ప్రభాకర్రావుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ను సుప్రీం మంజూరు చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆయన్ను అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
ప్రభాకర్రావుకు పాస్పోర్టు ఇవ్వాలని, ఇచ్చిన మూడు రోజుల్లో భారత్కు వచ్చి విచారణకు సహకరించాలని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశించింది. అయితే, ఈకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు అమెరికా వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్కు తిరిగి వస్తానని గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీనిపై ప్రభాకర్రావు మే 9న సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనని, చికిత్స కోసమే తాను అమెరికా వెళ్లానని కోర్టుకు వివరించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభాకర్రావుపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 5కు వాయిదా వేసింది. కాగా, తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికాలో ప్రభాకర్రావు పిటిషన్ వేయగా.. అందుకు అమెరికా ప్రభుత్వం తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు జూన్ 20లోపు కోర్టులో హాజరుకావాలని లేదంటే ప్రకటిత నేరస్థుడిగా ప్రకటిస్తామంటూ నాంపల్లి కోర్టు ఇటీవల స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్రావు ఇంటిగోడకు పోలీసులు నోటీసులు అంటించారు. ఇలా ప్రకటిస్తే ప్రభాకర్రావు ఆస్తులను కూడా జప్తు చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.