calender_icon.png 30 May, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీవోకే ప్రజలు మనవాళ్లే!

30-05-2025 01:49:21 AM

  1. వారు త్వరలోనే భారత్‌లో కలుస్తారు
  2. సంకల్పం.. గ్రేట్ ఇండియా 
  3. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

న్యూఢిల్లీ, మే 29: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు మన వాళ్లేనని, వారికి భారత్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి  రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొ న్నారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ పీవోకే ప్రజలు ఏదో ఒకరోజు భారత్‌లో కలిసిపోతారని, ఆ రోజు ఇక ఎంతోదూరంలో లేదని జోస్యం చెప్పా రు. పీవోకే దానంతట అదే భారత భూభాగం పరిధిలోకి వస్తుందనన్నారు. గ్రేట్ ఇండియా సంకల్పంతో మున్ముందు భారత్ అడుగులు వేస్తుందని స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలో గురు వారం కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నిర్వహించిన వాణిజ్య సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పీవోకేలో కొంతమంది మాత్రమే దారి తప్పారని, వారిని దారిలో పెట్టేందుకు భారత్ ఏమైనా చేయగలదని, కానీ.. తాము సంయమనం పాటిస్తున్నామని వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశానికి  ‘మేకిన్ ఇండియా’ అత్యంత కీలకమని నిరూపించామని అభిప్రాయపడ్డారు.

కేంద్రం ఇప్పుడు ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను బలోపేతం చేయడంతో పాటు సరికొత్త యుద్ధ సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం ప్రయోగించిన అత్యాధునిక ఆయుధ సంపత్తిని చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయిందని గుర్తుచేశారు. భారత సైన్యం ఇంకెంతో చేయగలదని, అవసరమైనప్పుడు ఆ శక్తి సామర్థ్యాలను బయటపెడతామని స్పష్టం చేశారు.

పాక్, పీవోకే పరిధిలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నామరూపాల్లేకుండా చేశామని, మున్ముందు ఉగ్రవాద సంస్థలు మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. భారత్ ఎప్పుడూ శాంతిని కాంక్షిస్తుందని, ఉద్రిక్త పరిస్థితుల్లో నిగ్రహాన్ని పాటిస్తుందని వెల్లడించారు. కానీ.. దేశ ప్రజల భద్రతకు భంగం వాటిల్లినప్పుడు మాత్రం ఏమాత్రం ఉపేక్షించదని తేల్చిచెప్పారు.

పహల్గాంలో పర్యాటకులపై దాడి కేవలం భారతీయులపై జరిగిన దాడి కాదని, మానవత్వంపై జరిగిన దాడిగా దానిని చూడాలని అభిప్రాయపడ్డారు. పహల్గాం ఘటన తర్వాత భారత్ నిఘా పెంచిందని వివరించారు. పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యనూ నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. భారత్ విషయంలో పాక్ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, భారత్ చాలా తీవ్రంగా స్పందిస్తుందని తేల్చిచెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలు చేసేవారికి సరైన సమాధానం చెప్తామని హెచ్చరించారు.