11 March, 2026 | 8:13 PM

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

11-03-2026 04:48 PM

ఆర్థిక ఇబ్బందులు ఉన్న 4 గ్యారంటీలు అమలు చేస్తున్నాం

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు

పెద్దపల్లి జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

పెద్దపల్లి,(విజయక్రాంతి): ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. పెద్దపల్లి మండలంలోని రాఘవపూర్ గ్రామంలోని రాధాకృష్ణ పంక్షన్ హాల్ లో బుధవారం నిర్వహించిన సమావేశానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని తీసుకున్నారని మంత్రి అన్నారు. 10 శాఖల అధికారులు సమన్వయం చేసుకొని 99 రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నాలుగు గ్యారంటీలు అమలు చేస్తున్నామని రానున్న రోజుల్లో మరో రెండు హామీలను అమలు చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి వివరించారు. విద్యార్థులకు చదువుకు ఏలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే బడ్జెట్ లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదలకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని మంత్రి సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని సాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఒక సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ పనులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.