ఘనంగా ‘ప్రజాపాలనప్రగతి ప్రణాళిక’ ప్రారంభం
మొయినాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రణాళిక (ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక) కార్యక్రమం మొయినాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ దుబ్బ సోనియా దర్శన్, వైస్ చైర్మన్ గరుగు రాజు, మరియు కమిషనర్ జాకీర్ అహ్మద్ కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
క్షేత్రస్థాయిలో పారిశుధ్య కార్యక్రమాలు ప్రారంభం అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి హిమాయత్ నగర్లోని గండిపేట చెరువు కట్ట వద్ద గల మైసమ్మ దేవాలయ ప్రాంగణంలో స్వయంగా చెత్తను సేకరించి పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ దుబ్బ సోనియా దర్శన్ మాట్లాడుతూ 99 రోజుల ప్రణాళిక ద్వారా మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన నిధులను మంజూరు చేస్తోందన్నారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రగతి ప్రణాళికలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నిర్ణీత కాలపరిమితిలో వార్డుల సమస్యలను పరిష్కరించి, మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆమె పేర్కొన్నారు. వార్డు కౌన్సిలర్లు పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, షాబాద్ కిషన్, బిల్లపాటి కవిత ఎల్లేష్, బేగంబీ తో పాటు ఇతర వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




