యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం కావాలి
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, మార్చి 24 (విజయ క్రాంతి): యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధం కావాలని, కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్ల ప్రణాళికపై జిల్లా ధాన్యం కొనుగోలు కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది యాసంగి సీజన్ లో 2 లక్షల 73 వేల 550 ఎకరాల్లో వరి ధాన్యం సాగైందని తెలిపారు. 6 లక్షల 46వేల 320 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేస్తున్నామని, 3 లక్షల 67 వేలా 776 మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో ఐకెపి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డిసిఎంఎస్, హాకా ద్వారా 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా పౌరసరఫరాలు, కో-ఆపరేటివ్, డి ఆర్ డి ఓ, మార్కెటింగ్ తదితర శాఖల అధికారులు ఇందుకు సన్నద్ధంగా ఉండాలని ఆదేశించారు. రైస్ మిల్లులకు ధాన్యం కేటాయింపు ధాన్యం, రవాణా తదితర ఏర్పాట్లు నిబంధనల ప్రకారం జరగాలని ఆదేశించారు.
అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగారావు, పౌరసరఫరాల సంస్థ డిఎం రజనీకాంత్, డి.ఆర్.డి.ఓ శ్రీధర్, డి.సి.ఓ రామానుజాచార్య, డిఎమ్ఓ షాబుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.




