27-06-2025 02:28:16 AM
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు,జూన్ 26 (విజయ క్రాంతి): గ్రామాలలో అక్కడక్కడా దొంగచాటుగా బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై ఉక్కు పాదం మోపి వారి జాబితా సిద్ధం చేయాలని పోలీసులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదేశించారు.మరోమారు గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఉక్కుపాదం మోపాలన్నారు.
గ్రామాలలో నెలకొన్న సమస్యలు తెలుసుకోడానికి ఇటీవల పలివెల గ్రామంలో ఆయన పర్యటించిన సందర్భంలో పలువురు మహిళలు గ్రామంలో దొంగచాటుగా బెల్ట్ షాపులు నిర్వహిస్తు మద్యం అమ్ముతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.గ్రామాలలో దొంగచాటుగా బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారని మీ దృష్టికి వస్తే వెంటనే సమాచారం ఇవ్వండని బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా మరో మారు బెల్ట్ షాపుల నిర్వహణపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు.మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, ముఖ్యంగా యువత చెడు వైపు వెళ్లడానికి మద్యం కారణమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మునుగోడు నియోజకవర్గంలో యువత చెడు వ్యసనాలకు పాల్పడకుండా ఉండడానికే బెల్ట్ షాపుల నిర్మూల, గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలన ను కఠినంగా చేపడుతున్నామని అన్నారు.బెల్ట్ షాపులు నిర్మూలించిన తర్వాత గ్రామాలలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొందని ఆ వాతావరణాన్ని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటామన్నారు.