24-02-2026 12:18:01 AM
రైతు భరోసా విడుదల చేయాలి
ధాన్యం బోనస్ రైతుల ఖాతాలో జమ చేయాలి
రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముత్యాల విశ్వనాథం
పాల్వంచ, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక చర్యలను విడనాడి రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. పాల్వంచ సిపిఐ కార్యాలయం చండ్ర రాజేశ్వరరావు భవనంలో రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు చండ్రా నరేంద్ర కుమార్ అధ్యక్షతన సోమవారం జరిగింది.
ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ జిల్లా, మండలాలలో రైతు సంఘం బలోపేతానికి ప్రతి నాయకులు కృషి చేయాలన్నారు. ఈ మేరకు జిల్లా మండల కమిటీలు ఏర్పాటు చేసి రైతు, ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడాలని సూచించారు.. రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకునే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు రైతు భరోసాను రైతులకు అందించలేదని మండిపడ్డారు. దీనితో రైతులు పెట్టుబడి సాయం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసాను అందజేసి రైతులను ఆదుకోవాలని అన్నారు.
సీసీఐ ద్వారా పత్తి కొనుగోలను మార్చి చివరి వరకు పొడిగించాలని అన్నారు. సన్నధాన్యానికి ప్రభుత్వం ఇస్తున్న బోనస్ ను చెల్లించాలన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తూ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ.. కార్పొరేట్ శక్తులకు వంత పాడుతూ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగారిచేందుకు అనేక కుట్రలకు తరలింపుతోందని మంగిపడ్డారు. దీనిలో భాగంగా పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించి జి రామ్ జి పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నది అన్నారు.
ఉపాధి హామీ పథకానికి 80 శాతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులను కేటాయించేదన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 80 నుండి 60 శాతానికి తగ్గించి రాష్ట్ర ప్రభుత్వంపై పెనుబారం మోపుతోందని అన్నారు. గతంలో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం 80 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఆన్లైన్ ద్వారా కాకుండా నేరుగా సరిపడా యూరియా సరఫరా చేయాలని ప్రభుత్వాలను కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నిర్మాణ బాధ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులుసర్ రెడ్డి పుల్లారెడ్డి, రాష్ట్ర కమిటీ కన్వీనర్ సలిగంటి శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మీసంశెట్టి పూర్ణచందర్రావు జిల్లా సహాయ కార్యదర్శి న రాటి రమేష్, వాడి లక్ష్మి, రాష్ట్ర సమితి సభ్యులు వైఎస్ గిరి, తదితరులు పాల్గొన్నారు.