24-02-2026 12:16:15 AM
జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 23(విజయక్రాంతి): బంజారాహిల్స్ పరిధిలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.స్థానికులు,పోలీసుల వివరాల ప్రకారం సోమవారం ఉదయం ఎన్ఎఫ్సీఎల్ వైపు ఉన్న వెంగళ్రావు పార్క్ వద్ద వేగంగా వచ్చిన ఒక వాటర్ ట్యాంకర్ బైక్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న ప్రయాణికురాలు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఫలితం లేకపోయింది.
చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒకరు సంతోష్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ హుస్సేన్ (40) అని పోలీసులు గుర్తించారు.ఆయన కుటుంబ పోషణ నిమిత్తం ఖాళీ సమయాల్లో రాపిడో డ్రైవర్గా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు.ప్రమాద సమయంలో ఆయన బైక్ వెనుక ఉన్న యువతిని విజయనగరానికి చెందిన అక్షిత (20)గా గుర్తించారు.
ఆమె తన గమ్యస్థానానికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకోగా మార్గమధ్యలోనే ఈ ప్రమాదం ఆమె ప్రాణాలను హరించింది. ఈ ప్రమాద వార్త తెలియగానే హోంగార్డు సయ్యద్ హుస్సేన్ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది.ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేవలం అదనపు ఆదాయం కోసం కష్టపడుతున్న క్రమంలో ఇలాంటి విషాదం జరగడం తోటి సిబ్బందిని సైతం కలచివేస్తోంది. ప్రస్తుతం ఇద్దరి మృతదేహాలు నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నాయని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.