14-06-2025 11:12:37 PM
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్..
బూర్గంపాడు (విజయక్రాంతి): ప్రజలకి వైద్య సేవలు సంపూర్ణంగా అందించాలని, ప్రాథమిక వైద్య సేవలు ప్రతి మారుమూల గిరిజన పల్లెలకు అందించాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్(State Health Director Ravindra Nayak) అన్నారు. శనివారం బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుతున్న సదుపాయాలు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి ఓపి రిజిస్టర్ను పరిశీలించి అభినందించారు. ల్యాబ్ రూమ్, మందుల గది, డెలివరీ రూమ్, ఓపి రూమ్, ఆసుపత్రి చుట్టూ పరిసర ప్రాంతాలు , టాయిలెట్స్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో మొక్కల నాటి సంరక్షణ చేపట్టాలని సూచించారు. మందులు కొరత లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరుపై ఆయన డాక్టర్ లక్ష్మీ సాహితిని సిబ్బందిని అభినందించారు. అనంతరం మీటింగ్ హాల్లో హాస్పిటల్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలను క్షుణ్ణంగా వివరించారు. ముఖ్యంగా ఆశ వర్కర్ నుండి హెల్త్ మెడికల్ ఆఫీసర్ వరకు ఒకరికి ఒకరు కోఆర్డినేట్ చేసుకొని వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం చేయొద్దని, ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ శాతం పెంచాలని, గర్భిణీ స్త్రీలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ అయ్యేవిధంగా చూడాలని అన్నారు.
ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్యాలను ప్రతినిత్యం గమనిస్తూ ఆరోగ్య సూత్రాలను ప్రజలకు వివరిస్తూ నిత్యం అందుబాటులో ఉండే ఆశ వర్కర్లను, ఏఎన్ఎం లను అభినందిస్తూ బాధ్యత సేవగా చేసే విధంగా మెలగాలని సూచనలు అందించారు. వైద్యశాల విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం చేసిన సహించేది లేదన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా వైద్యాధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ భాస్కర్ నాయక్, కొత్తగూడెం డిప్యూటీ డిఎంహెచ్ఓ జయలక్ష్మి, భద్రాచలం డిప్యూటీ డిఎంహెచ్ఓ చైతన్య, ఎన్ సి డి పిఓ మధువరన్, జిల్లా టీవి ప్రోగ్రాం ఆఫీసర్ పుల్లారెడ్డి,వైద్యురాలు లక్ష్మి సాహితి, ఆయుర్వేద డాక్టర్ జయ,హెచ్ వి లు రమణ, వెంకట నరసింహ, ఆసుపత్రి సిబ్బంది జితూ నాయక్, జై బాబు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.