14-06-2025 11:14:55 PM
గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని(World Blood Donor Day) పురస్కరించుకొని, తెలంగాణ రెడ్ క్రాస్ సొసైటీ రాజ్ భవన్లో వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాకు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఉత్తమ అవార్డును అందుకున్నారు. జిల్లాలో అత్యధికంగా రక్త యూనిట్లు సేకరించడంలో శ్రద్ధ చూపడంపై జిల్లా ఉత్తమ ప్రతిభను గుర్తించి, ఉత్తమ జిల్లా అవార్డును ఎమ్మెల్యేకు స్వయంగా రాష్ట్ర గవర్నర్ అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొని జిల్లా తరపున అవార్డు అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నానన్నారు. రక్తదానం ఓ మహత్తర సేవ. ఒక్కరైనా రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు నిలబెడతాం. ప్రతి ఒక్కరూ ఏడాదిలో కనీసం ఒక్కసారైనా రక్తదానం చేయాలని, దానిని మన జీవనశైలిలో భాగంగా మార్చుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కార్యక్రమం ముగింపులో గవర్నర్ కి నాగర్ కర్నూల్ జిల్లా ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారితోపాటు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి రమేష్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ యువజన విభాగం సభ్యులు డి కుమార్ తదితరులు ఉన్నారు.