calender_icon.png 17 June, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి

17-06-2025 12:47:24 AM

కలెక్టర్ హనుమంతరావు 

యాదాద్రి భువనగిరి జూన్ 16 ( విజయ క్రాంతి ); వివిధ ప్రాంతాల ప్రజల సమస్యల నుండి వచ్చిన   దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ హనుమంతరావు  అన్నారు. సోమవారం రోజు కలెక్టరేట్   సమావేశ  మందిరంలో  జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 59 అర్జీలను,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అర్జీలను స్వీకరించారు.

సంబంధిత అధికారులు దరఖాస్తులను   పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. అందులో రెవిన్యూ శాఖ 37,జిల్లా పంచాయతీ శాఖ 8, ట్రాన్స్కో 3, జిల్లా పరిషత్ 2, జిల్లా సంక్షేమ శాఖ 2, ఆర్.టి.సి , మున్సిపాలిటీ, ఈ.డి. యం, సర్వే ల్యాండ్స్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ,ఎస్సీ కార్పొరేషన్   శాఖలకు  ఒక్కొకటి చొప్పున  వచ్చాయని తెలియజేశారు.

వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు, శానిటేషన్, సీజనల్ వ్యాధులు, మిషన్ భగీరథ, అంగన్వాడీ, భూ భారతి , విద్య సంస్థలు,  సంబంధిత శాఖల అధికారులందరూ తమ శాఖల పనుల పై దృష్టి  సారించాలన్నారు. 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా,  వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాలలో ఉన్న  మంచి నీటి ట్యాంకర్లను ఎప్పటికపుడు  శుభ్రపరచలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల తరగతి గదులలో ప్రతి రోజు శానిటేషన్ కొనసాగించాలన్నారు.

డ్రైనేజ్ పైపులు లీకేజీ కాకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పాఠశాలలో త్రాగు నీరు, విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా చూడాలన్నారు. మండలాల్లో జరుగుతున్న  రెవెన్యూ భూ భారతి సదస్సులు ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,వివిధ శాఖల  జిల్లా అధికారులు పాల్గొన్నారు.