calender_icon.png 17 June, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం పేరుతో మోసం

17-06-2025 12:45:42 AM

అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్  రూ.4 లక్షల నగదు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం

నల్లగొండ టౌన్, జూన్ 16 : వేర్వేరు కేసుల్లో బంగారం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అంతరాష్ట్ర నిందితులను  అరెస్ట్  చేసి వారి వద్ద నుండి  నాలుగు లక్షల నగదు, మూడు సెల్ ఫోన్లు, అర గ్రాము బంగారం స్వాధీనం చేసినట్లు నల్లగొండ డిఎస్పీకే శివరాంరెడ్డి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 

గుంటూరు జిల్లాకు చెందిన బత్తుల యేసు   ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడి, బాగా అప్పులు చేసి, ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలని అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి, బంగారం తక్కువ రేటుకు అమ్ముతానని నమ్మించి, మభ్యపెట్టి డబ్బులు కాజేసి పారిపోవాలని నిర్ణయించుకొని గుర్తుతెలియని మగ వ్యక్తి, మరొక మహిళతో నల్లగొండ వన్ టౌన్ పట్టణ పరిధిలోని దేవరకొండ రోడ్ లో   ఉన్న  అనస్వి మెడికల్ షాప్ వద్దకు గత సంవత్సరం    8/11/2024  నాడు వచ్చాడు.

మందులు కావాలని అడుగుతూ ‘నా పేరు రవి, మాది ఒంగోలు జిల్లా, ఇక్కడ బిల్డర్ గా పనిచేస్తున్నాను. నా దగ్గర కొంత పురాతన బంగారం ఉంది, దానిని నీకు తక్కువ ధరకి ఇస్తాను అని చెబుతూ ఒక బంగారు బిళ్ళని తెచ్చి చూపించాడు. దానిలో ఒక ముక్క తీసి పరీక్షించుకోమనగా ఆ షాపు యజమాని   చెక్ చేయించగా ఒరిజినల్ బంగారం అని తెలిసింది. రెండు రోజులు సమయం ఇస్తాను, ఐదు లక్షలు సర్దితే 22 తులాల బంగారం బిస్కెట్ ఇస్తానని చెప్పాడు.

ఆ యజమాని వెంటనే  ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఆ బిస్కెట్ తీసుకొని మళ్లీ జువెలరీ షాప్ లో చెక్ చేయించుకున్నప్పుడు నకిలీ అని తెలిసింది. దీనితో మోసపోయానని గ్రహించి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా  కేసు నమోదు చేసుకుని పోలీసులు  విచారణ చేపట్టారు.ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీ  శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, నల్గొండ డి.ఎస్.పి  కె శివరాం రెడ్డి  ఆధ్వర్యంలో, సీసీఎస్ సిఐ జితేందర్ రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎస్త్స్రతో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు డీఈఓ ఆఫీస్ వద్ద సోమవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నిందితుడు గతంలో కుషాయిగూడ, నల్గొండలో ఇలా నేరాలు చేయగా, కేసులై జైలుకు వెళ్లి రావడం జరిగిందన్నారు. మరో నిందితురాలు లక్ష్మి పరారీలో ఉన్నది. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం విడిపిస్తే అదే బంగారాన్ని తక్కువ ధరకు అమ్ముతానని జువెలరీ షాప్ వ్యక్తిని నమ్మించి 1,20,000 నగదు కొట్టేసిన మరో అంతరాష్ట్ర నిందితుడు కూడా అరెస్టయ్యారు.