23-06-2025 06:53:46 PM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్ నగర్ మున్సిపాలిటీకి చెందిన అభింబి తనకు 4 సంవత్సరాలుగా పింఛన్ రావడం లేదని, పునరుద్ధరించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
పెంచికల్ పేట మండలం చెడ్పాయి గ్రామానికి చెందిన బోయిరే బావాజీ గత నెలల క్రితం తన కుమారుడికి, మనుమడికి పట్టా ఇచ్చినప్పటికీ తమ పోషణ పట్టించుకోవడం లేదని, వారి నుండి భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ పట్టణం శివకేశవ మందిరం ప్రాంతానికి చెందిన వైరగడె లక్ష్మి తనకు సంబంధించిన 2 ఎకరాల వ్యవసాయ భూమికి రైతు భరోసా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. పెంచికలపేట మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన కొప్పుల రోహిత్ తమ గ్రామంలో మీ- సేవా కేంద్రం ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన నికోడే లక్ష్మీబాయి గ్రామ శివారులో తనకు గల పట్టా భూమికి సంబంధించి పట్టా పాసుపుస్తకాలు జారీ చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన అంగాల సాంబయ్య తనకు పులికుంట గ్రామ శివారులో గల పట్టాభూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం గోవిందపూర్ గ్రామస్తులు తమకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల కొరకు చేపట్టిన నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ వారు అడ్డుపడుతున్నారని, తగు చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు.
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం రుకుంబాయి తన భర్త పేరిట గల భూమిని తన కుమారుడు తన పేరిట పట్టా మార్చుకున్నాడని, ఇప్పుడు తన పోషణ పట్టించుకోవడం, ఈ విషయంపై తను చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషిచేసి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకూడదని, దరఖాస్తుల పరిష్కారం వివరాలను సంబంధిత దరఖాస్తుదారులకు తెలియజేయాలని తెలిపారు.
జిల్లాలో వరమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను 100 శాతం పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాకు 51 లక్షల మొక్కలు నాటడం కొరకు లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందని, ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున మొక్కలు నాటేందుకు అనువైన సమయం చూసి మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామపంచాయతీలు, అటవీ శాఖల నుండి మొక్కలు తీసుకొని అవసరమైన చోట, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో, ఖాళీ స్థలాలలో మొక్కలు నాటి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.