calender_icon.png 1 November, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి

31-10-2025 08:40:38 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలో  కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ సింగ్, మండల పంచాయతీ అధికారి సప్దర్ అలీ లతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనంలో నాణ్యత, ఇంటర్మీడియట్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, పరిసరాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. మధ్యాహ్న భోజనంలో పౌష్టిక ఆహారాన్ని అందిస్తుందని, ఈ క్రమంలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని ఆదేశించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యా బోధన అందిస్తుందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

తెలంగాణ ఆదర్శ పాఠశాల - కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల లను సందర్శించి ల్యాబ్, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించి అధికారులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల సంఖ్య పెంపొందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించి విద్యా బోధన చేయాలని తెలిపారు. మండలంలోని రేగులగుంట, మల్కపెల్లి గ్రామాలలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలను సందర్శించి వంటశాలలు, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించి విద్యా బోధన అందించాలని, పాఠశాలలలో అవసరమైన మూత్రశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.