02-06-2025 11:18:01 PM
గ్రామ గ్రామాన రైతులకు అందజేత..
ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు..
మంచిర్యాల (విజయక్రాంతి): ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనం అందితేనే లాభసాటి వ్యవసాయానికి సోపానం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. సోమ వారం కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నాణ్యమైన విత్తనం-రైతన్నకు నేస్తం’ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, నోడల్ అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కల్పనలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ సహకారంతో ఈ ఏడాది రైతుల కోసం ‘నాణ్యమైన విత్తనం - రైతన్నకు నేస్తం’ నినాదంతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో భాగంగానే గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎంపిక చేసిన రైతులకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్బంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఎంపిక చేసిన రైతులకు అందజేత...
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆలోచన ప్రకారం అన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేసిన నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేసిన ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యుదయ రైతులకు అందజేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. ఈ నాణ్యమైన విత్తనాన్ని రైతులు సాగు చేసి తదుపరి పంట ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాన్ని తోటి రైతులకి తక్కువ ధరకే అందజేయాలన్నారు.
ఎంపిక కాబడ్డ రైతులకు విత్తన ఉత్పత్తిపై ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల ద్వారా సలహాలు, సూచనలు ఇస్తారని, మరో 2, 3 సంవత్సరాలలో ప్రతి గ్రామాన విత్తన స్వయం సమృద్ధి సాధించడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. దీనితో తెలంగాణ రాష్ట్రం విత్తన భద్రతలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవనుందన్నారు. రైతులు విత్తనం వేసినప్పటి నుంచి పంట కోత వరకు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని, రైతు స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత, బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు, మండల వ్యవసాయ అధికారులు మహేందర్, కృష్ణ, రజిత, ఎంపికైన రైతులు తదితరులు పాల్గొన్నారు.