02-06-2025 11:21:41 PM
జిల్లా ఆన్ని రంగాల్లో ముందుకు దుసుకువెళుతోంది..
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ..
అదిలాబాద్ (విజయక్రాంతి): అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతొందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ(State Government Advisors Mohammed Shabbir Ali) అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో సోమవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్ లతో కలిసి ముందుగా అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.
అదేవిధంగా నార్నూర్ అస్పిరేషనల్ బ్లాక్ లో అత్యుత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు. అనంతరం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి షబ్బీర్ అలీ మాట్లాడుతూ... రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్పూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి దిశ వైపు పయనిస్తుందన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో జిల్లాని మరింతగా అభివృద్ధి దిశ వైపు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డీ బోజా రెడ్డి, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డిఓ వినోద్ కుమార్, పలువురు ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.