28-06-2025 12:19:22 AM
-తుర్కపల్లి హనుమాన్ రైస్ మిల్లు నుంచి గజ్వేల్ గోదాంకు తరలింపు
-ఇతర మిల్లులకు చెందినవిగా గుర్తించిన టాస్క్ ఫోర్స్ అధికారులు
-మరో 580 క్వింటాళ్ల బియ్యంపై అనుమానాలు వ్యక్తం
-శ్యాంపిల్ సేకరణ, రీసైక్లింగ్ చేసినట్టు అనుమానాలు వ్యక్తం
గజ్వేల్, జూన్26: గజ్జల ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్ పల్లి సివిల్ సప్లై గోదాములకు తరలిస్తున్న 580 క్వింటాళ్ల రీసైక్లింగ్ పిడిఎఫ్ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి ప్రభాకర్, సిద్దిపేట జిల్లా డిఎస్పీ వెంకటేశ్వర్లు, ప్రత్యేక అధికారి లక్ష్మారెడ్డి తదితర టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు డి ఎస్ పి వెంకటేశ్వర్లు వెల్లడించారు.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుర్కపల్లి కి చెందిన హనుమాన్ రైస్ మిల్లుకు కేటాయించిన ధాన్యానికి బదులుగా రీసెక్లింగ్ చేసిన బియ్యాన్ని గజ్వేల్ గోదాంకు పంపిస్తున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. బియ్యం లారీలను పట్టుకొని పరిశీలించగా హనుమాన్ రైస్ మిల్లుకు కేటాయించిన బస్తాలు కాకుండా ఇతర రైస్ మిల్ లోకి చెందిన బస్తాల నెంబర్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
అలాగే మరో లారీలో సైతం 290 క్వింటాళ్ల బియ్యం బస్తాలు హనుమాన్ రైస్ మిల్లు కు కేటాయించిన బస్తాలలోనే వచ్చినా కూడా వాటిపై అనుమానం వ్యక్తం చేస్తూ శాంపిల్స్ సేకరించారు. గత రెండు రోజులుగా హనుమాన్ మిలి నుండి గజ్వేల్ సివిల్ సప్లై గోదాంకు వచ్చిన బియ్యం శాంపిల్స్ ని కూడా అధికారులు సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు హనుమాన్ రైస్ మిల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డి, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ వెల్లడించారు.