25-09-2025 01:44:10 AM
సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చిన హైకోర్టు డివిజన్ బెంచ్
హైదరాబాద్, 24 (విజయక్రాంత్రి) : గ్రూప్ మెయిన్స్ ర్యాంకర్లకు హైకోర్టు లో ఊరట లభించింది. గ్రూప్ అం శంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. సింగిల్ బెంచ్ తీర్పు అసంబద్ధమని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
తుది తీర్పునకు లోబడి గ్రూప్ నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణను అక్టోబర్ 15కు వాయిదా వేసింది. దీనిపై బుధవారం చీఫ్ జస్టిస్ అవరేశ్కుమార్ సింగ్, జీఎం మొహినొద్దీన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
సింగిల్ బెంచ్ తీర్పు అసంబద్ధమం టూ ఏజీ సుదర్శన్రెడ్డి వాదించారు.
14ఏళ్ల తర్వాత గ్రూప్ నిర్వహించారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించిందని కోర్టుకు తెలిపారు. గ్రూప్ రూల్స్లో.. రీవాల్యూయేషన్ అనేది లేదని.. రీకౌంటింగ్ మాత్రమే ఉందని తెలిపారు. కేవలం ఆరోపణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు.
ఈ తీర్పు సహేతుకం కాదని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. నియామకాలు జరుపుకోవచ్చంటూ ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తుది తీర్పునకు లోబడే నియామకాలు ఉంటాయని తెలిపింది.
ఆధారాలున్నాయా?
టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదని సింగిల్ బెంచ్ తీర్పులో ఉందని హైకోర్టు పేర్కొంది. ఇంటిగ్రిటి అనేది చాలా సున్నితమైన పదమని పేర్కొంది. మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ వంటివి ఏమైనా జరిగాయా..? అంటూ హై కోర్టు సందేహం వ్యక్తం చేసింది. సింగిల్ బెం చ్ తీర్పులో చాలా డెలికేట్ పదాలు ఉన్నాయని వివరించింది.
బయాస్, ఇంటిగ్రిటీ అనే పదాలు ఉపయోగించారని.. బయాస్ అంటే ఎవరికైనా ఫేవర్ చేశారా? అంటూ హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. వాటికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించింది. ఇలాంటి విషయాలపై తీర్పు ఇచ్చేటప్పుడు అన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.