25-09-2025 01:33:58 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఆన్లైన్ బెట్టి ంగ్ అనే మాయాజూదంతో వేల కోట్ల ను కొల్లగొట్టి, యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న అంతర్రాష్ర్ట ముఠాల డొంకను తెలంగాణ సీఐడీ కదిలించిం ది. అత్యంత పకడ్బందీగా చేపట్టిన ఆపరేషన్లో భాగంగా రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 8 మంది కీలక ఆపరేటర్లను అదుపులోకి తీసుకుంది.
ఈ ముఠా నిర్వహిస్తున్న ఆరు ప్రధాన బెట్టింగ్ యాప్లను గుర్తించిం ది. విదేశాల్లో ఉన్న ప్రధాన సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న సినీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లలో గుబులు మొద లైంది. తెలంగాణవ్యాప్తంగా నమోదైన పలు బెట్టింగ్ యాప్ కేసులను ప్రభుత్వం సీఐడీకి అప్పగించడంతో దర్యాప్తు వేగం పుంజుకుంది.
సాంకేతిక ఆధారాలతో మూలాలను శోధించిన ఆరు ప్రత్యేక సీఐడీ బృందాలు.. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్లలోని ఆరు ప్రాంతాలపై ఏకకాలంలో మెరుపుదాడులు చేశాయి. ఈ దాడుల్లో 8 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తెలుగు 365, ఆంధ్రా 365, యాస్ 365, తాజా 007, వీఎల్ బుక్, ఫైర్ ప్లే లైవ్ అనే ఆరు బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.
ఈ ప్లాట్ఫారమ్ల ద్వారా వేలాది మందిని ఆకర్షించి, భారీ ఆర్థిక దోపిడికి పాల్పడ్డారని సీఐడీ పేర్కొంది. సోదాల్లో అక్రమ లావాదేవీలు, బెట్టింగ్ రికార్డులకు సంబంధించిన కీలక డేటా ఉన్న హార్డ్వేర్ పరికరాలు, సర్వర్లు, డిజిటల్ స్టోరేజ్ యూనిట్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు.
విదేశాల్లో కీలక సూత్రధారులు..
ప్రాథమిక దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్టయిన 8 మంది కేవలం క్షేత్రస్థాయి ఆపరేటర్లు మాత్రమేనని, ఈ బెట్టింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు విదేశాల్లో ఉంటూ కార్యకలాపాలను సమన్వయం చేస్తున్నారని తేలింది. హవాలా మార్గాల్లో వేల కోట్ల రూపాయలను ఇప్పటికే దేశం దాటించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వారి అంతర్జాతీయ సంబంధాలను గుర్తించి, కటకటాల్లోకి నెట్టేందుకు సీఐడీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
సెలబ్రిటీల మెడకు ఉచ్చు..
బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన పలువురు సినీతారలు, సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్లు, యూట్యూబర్లకు హవాలా మార్గాల్లోనే రెమ్యూనరేషన్ చెల్లించారనే ఆరోపణ లతో ఇప్పటికే మియాపూర్, పంజాగుట్ట పోలీసులు 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులన్నీ సీఐడీ పరిధిలోకి రావడంతో విచారణ వేగవంతమైంది.
ఇప్పటికే నోటీసులు అందుకున్న వారిలో దగ్గుబాటి రానా, ప్రకాశ్రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి, వర్షిణి, యాంకర్ శ్యామల, టేస్టీ తేజ, హర్షసాయి వంటి ప్రముఖులు ఉన్నారు. వీరిలో చాలామంది ఇప్పటికే విచారణకు హాజరు కాగా, తాజా అరెస్టులతో కేసు మరింత బిగుసుకుంటోంది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ కూడా ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లపై కొరడా ఝుళిపిస్తోంది. ఇప్పటికే 357 వెబ్సైట్లను బ్లాక్ చేయగా, సుమారు 700 విదేశీ సంస్థలపై నిఘా పెట్టింది.