21-06-2025 11:31:39 PM
మంథని (విజయక్రాంతి): మంథని రెవెన్యూ శివారులోని రెడ్డి చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని మంథని తహసిల్దార్ కుమారస్వామికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంథని నియోజకవర్గంలో మట్టి మాఫియా రాజ్యమేలుతుందని ఇటుక బట్టి యజమానులు మట్టి మాఫియా కుమ్మక్కై సహజ వనరులైన నల్ల మట్టిని దోచుకెళుతున్నారని విమర్శించారు. చెరువులో మట్టి తీయాలంటే రెవెన్యూ, ఇరిగేషన్, మైనింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఇచ్చిన నివేదికల ఆధారంగా అధికారులు అనుమతులు ఇవ్వాలని ఆ తర్వాతనే మట్టిని తీయాలని ఉన్నతాధికారులు ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
రెడ్డి చెరువులో మట్టి వ్యాపారులు విచ్చలవిడిగా తవ్వకాలు చేపడుతున్నారని చెరువు శిఖం భూమిని కూడా వదలటం లేదని అన్నారు. ఇప్పటికే రెడ్డి చెరువు మట్టి తవ్వకాలకు రెండుసార్లు అనుమతులు ఇచ్చారన్నారు. ప్రభుత్వానికి అతి తక్కువ సీనరేజ్ చార్జీలు చెల్లించి కోట్లాది రూపాయలను దండుకుంటున్నారన్నారు. మట్టి లారీలు రోడ్డు భద్రత నియమాలను పాటించకుండా ఓవర్ లోడ్ తో నడపడం వల్ల రహదారులు దెబ్బతింటున్నావని వారు తెలిపారు.అధికారులు ప్రభుత్వ చెరువులు సంరక్షణ, ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారా లేదా, ఇటుక బట్టి యజమానులు, మట్టి మాఫియా సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారా అని ప్రశ్నించారు. భావితరాల కోసం రెడ్డి చెరువు సంరక్షణను దృష్టిలో పెట్టుకొని అధికారులు మళ్లీ మూడవసారి మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దని కోరారు.