calender_icon.png 30 September, 2025 | 1:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు లేకున్నా సర్పంచ్‌కు రిజర్వుడ్

30-09-2025 01:12:06 AM

అధికారుల తప్పిదంతో నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో రెండు తండాలకు శాపం

కుబీర్, సెప్టెంబర్ 29: రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం ప్రకటించిన రిజర్వేషన్లపై గందరగోళం నెలకొం ది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రెండు తండాల్లో బీసీలు లేకున్నా సర్పంచ్ స్థానం బీసీలకు రిజర్వ్‌డు అయింది. ఒక్క బీసీ ఓటరు లేని తండాల్లో బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేయడంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్నది.

మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండా రెండింటిలో 100 శాతం గిరిజనులే ఉన్నారు. అయినప్పటికీ రిజర్వేషన్ మాత్రం బీసీ జనరల్‌కు కేటాయించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బీసీలు లేని గిరిజన తండాల జీపీలకు బీసీ రిజర్వేషన్ కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఈ సమస్యపై స్పందించి వెంటనే ఎస్టీ రిజర్వేషన్‌ణు కల్పించాలని తండావాసులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడేది లేదని హెచ్చరికలు జారీ చేశారు.