30-06-2025 02:19:14 AM
* ఘటనాఘటన సమర్థులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో రేవంత్రెడ్డి నెగ్గుకురాగలరా.. అనేది తొలినాళ్లలో అందరి మది ని తొలచిన ప్రశ్న. కాంగ్రెస్లో రేవంత్రెడ్డికంటే సీనియర్లు చాలామందే వున్నారు. వారిలో ముఖ్యమంత్రి అభ్యర్థులం తామే అన్నవారూ ఉన్నారు. పద్దెనిమిది నెలల కాలాన్ని గమనిస్తే పార్టీలోని సీనియర్లందరినీ రేవంత్రెడ్డి తనవైపు తిప్పుకున్నారు. మా నాయకుడు రేవంత్ రెడ్డే, ఆయనకు తిరుగులేదు.. అని దాదాపుగా అందరూ బాహాటంగానే ప్రకటించారు.
* అనేకానేక స్వయంకృతాపరాధాలతో ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్కు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పేందుకు ఎన్నో అవకాశాలు వచ్చిన మాట నిజం. బీఆర్ఎస్ తన నిరసన గళాన్ని ప్రజలకు వినిపించేలోగానే కాంగ్రెస్ ఒక అజెండాగా పలు అంశాలను తన చేతిలోకి తీసుకోగలిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఆరు గ్యారెంటీలు అమలు పూర్తి చేయలేదేం..? అని బీఆర్ఎస్ గట్టిగా అడగలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అమలుకు వెనుకంజ వేసిందని ప్రజల్లో బలంగా ప్రచారం చేయలేకపోయింది.
* కేంద్రం నుంచి నిధులు రాబట్టడం రేవంత్రెడ్డికి పెద్ద సవాల్గా మారింది. బీజేపీని ఒక వంక తీవ్రంగా విమర్శిస్తూనే, ప్రధాని మోదీని మంచి చేసుకునేందుకూ రేవంత్రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘బడే భాయి- చోటా భాయి’ అనుబంధాన్ని తను మోదీ నుంచి ఆశిస్తున్నానని చెప్పుకున్నారు. అసలు తను బీజేపీ స్కూళ్లోనే చదువుకున్నానని చెప్పుకున్నారు. తాజాగా, రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటించడం మరోవైపు బీజేపీ శ్రేణులకు చెక్పెట్టడంగానే చూడాల్సి ఉంటుంది.
ఏమాటకు అ మాటే చెప్పుకోవాలి. అసెంబ్లీ ఎన్నికలు జరిగి పద్దెనిమిది నెలలు కావొస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వరకు బీఆర్ఎస్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా వున్న బీఆర్ఎస్ను ఓడించడం అంత తేలికకాదనే భావన ప్రజల్లో ఉండేది. ఇక కేసీఆర్ సామర్థ్యాల గురించి అందరికీ తెలిసిందే. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్, ఢిల్లీ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని అస్త్రాలు ఎక్కుపెట్టిన రోజులవి. ఆనాడు తెలంగాణ అంతా కేసీఆర్ మాట విన్నది.
లేదా వింటున్నట్టు నటించింది. అదే సమయంలో రేవంత్రెడ్డి తనదైన శైలిలో కాంగ్రెస్ శ్రేణుల కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, పార్టీని ఒక్కత్రాటిపైకి తెచ్చా రు. పార్టీలోని మహామహ నాయకులను సమన్వయపర్చుకున్నారు. కాంగ్రెస్ను ఉరకలెత్తే ఉత్సాహంతో, వ్యూహంతో ముందుకు పరుగెత్తించారు. విజయ తీరానికి కాంగ్రెస్ను చేర్చేందుకు రేవంత్రెడ్డి కాలుకు బలపం కట్టుకుని రాష్ట్రమంతా కలియదిరిగారు. ప్రజలకు ఎక్కడికక్కడ వాగ్దానాలు చేశారు. కర్ణుడి చావుకు వేయి కారణాలు అన్నట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొత్త అధ్యాయానికి తెరలేపింది.
ఘటనాఘటన సమర్థులైన సీనియర్ కాంగ్రెస్ నాయకులతో రేవంత్రెడ్డి నెగ్గుకురాగలరా.. అనేది తొలినాళ్లలో అందరి మదిని తొలచిన ప్రశ్న. కాంగ్రెస్లో రేవంత్రెడ్డికంటే సీనియ ర్లు చాలామందే వున్నారు. వారిలో ముఖ్యమంత్రి అభ్యర్థులం తామే అన్నవారూ ఉన్నారు. పద్దెనిమిది నెలల కాలాన్ని గమనిస్తే పార్టీలోని సీనియర్లందరినీ రేవంత్రెడ్డి తనవైపు తిప్పుకున్నారు.
మా నాయకుడు రేవంత్రెడ్డే, ఆయనకు తిరుగులేదు.. అని దాదాపుగా అందరూ బాహాటంగానే ప్రకటించారు. పార్టీ సీనియర్ నాయకుల తీరు అధిష్ఠానం అభీష్టానికి అనుగుణంగా మారారనేది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఇక నిశితంగా పరిశీలించిన తర్వాత తనను అభిమానించే, తనకు ఇష్టమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కీలకమైన స్థానాల్లో రేవంత్రెడ్డి నియమించుకున్నారు.
అనేకానేక స్వయంకృతాపరాధాలతో ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్కు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పేందుకు ఎన్నో అవకాశా లు వచ్చిన మాట నిజం. బీఆర్ఎస్ తన నిరసన గళాన్ని ప్రజలకు వినిపించేలోగానే కాంగ్రెస్ ఒక అజెండాగా పలు అంశాలను తన చేతిలోకి తీసుకోగలిగింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాగ్దానం ఆరు గ్యారెంటీలు అమలు పూర్తి చేయలేదేం..? అని బీఆర్ఎస్ గట్టిగా అడగలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో అమలుకు వెనుకంజ వేసిందని ప్రజల్లో బలంగా ప్రచారం చేయలేకపోయింది.
ప్రధాన ప్రతిపక్షంగా తను లేవనెత్తిన అవినీతి అంశాన్ని గానీ, బనకచర్ల వంటి అంశాల్లో గానీ బీఆర్ఎస్ అంతగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రైవేటు దిశగా పయనిస్తున్న ఆర్టీసీ, ఉద్యోగ సమస్యలు, బీసీ, మహిళలకు సంబంధించిన అంశాల్లోనూ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సాధించిన ఫలితం గోరంతే. కేసీఆర్ అనారో గ్యం , పార్టీలో కవిత భిన్నస్వరం, కేటీఆర్కు హరీశ్రావుకు మధ్య విభేదాలున్నాయనే భావన రేవంత్రెడ్డికి కలిసివచ్చింది. దీంతో రేవంత్రెడ్డి బీఆర్ఎస్ను తన బుట్టలో వేసుకోగలిగారనే చెప్పాలి. పలు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు విలేకరుల సమావేశాలకు పరిమితం కావాల్సి వచ్చింది.
ఇక కేంద్రం నుంచి నిధులు రాబట్టడం రేవంత్రెడ్డికి పెద్ద సవాల్గా మారింది. బీజేపీని ఒక వంక తీవ్రంగా విమర్శిస్తూనే, ప్రధాని మోదీని మంచి చేసుకునేందుకూ రేవంత్రెడ్డి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ‘బడే భాయిన చోటా భాయి’ అనుబంధాన్ని తను మోదీ నుంచి ఆశిస్తున్నానని చెప్పుకున్నారు. అసలు తను బీజేపీ స్కూళ్లోనే చదువుకున్నానని చెప్పుకున్నారు. తాజాగా, రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తామని ప్రకటించడం మరోవైపు బీజేపీ శ్రేణులకు చెక్పెట్టడం గానే చూడాల్సి ఉంటుంది.
బీఆర్ఎస్ పాలనలో మొదటి ఐదేళ్లు యజ్ఞాలతో, పార్లమెంట్లో పలు బిల్లులకు బీజేపీ ప్రభుత్వానికి మద్దతునివ్వడం ద్వారా రాష్ట్రంలో కేసీఆర్ బీజేపీకి చెక్ పెట్టారు. రేవంత్రెడ్డి అదే వ్యూహాన్ని ఇప్పుడు బీజేపీకి చెక్పెట్టేందుకు ప్రయోగిస్తున్నట్లు కనిపిస్తున్నది. బీజేపీ హిందూత్వ అజెండాను ఎదుర్కొని నిలవాలంటే ఇతర పార్టీలకు ఒక వ్యూహం అవసరమవుతున్నది.
పద్దెనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు తమకు గిట్టని విషయాలు చెప్పకుండా ఉంటారా? చెప్పే ఉంటారు. పార్టీలో ముసలం పుట్టకపోతే అది కాంగ్రెస్ పార్టీయే కాదు. రాష్ట్ర పార్టీ సీనియర్లు కొందరు ప్రభుత్వం తీరుపై తమ నిరసనలు తెలిపేవుంటారు. అందుకే ముఖ్యమంత్రికి ఢిల్లీలో అధిష్ఠానం అపాయింట్మెంట్లు దొరకడం అంత సులువుగా కనిపించలేదు. దానితోనే క్యాబినెట్ విస్తరణ కార్యక్రమం అనేక వాయిదాలు పడి ఉండవచ్చు. పార్టీని, పాలనను ఒక గాడిలో పెట్టిన రేవంత్రెడ్డి తీరును కూడా పార్టీ ఢిల్లీ పెద్దలు పరిగణలోకి తీసుకుని వుంటారు.
నిజానికి పరిగణలోకి తీసుకోకుండా ఉండలేని పరిస్థితి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం వుంది. క్షేత్రస్థాయిలో అంతకంతకూపెరుగుతున్న అవినీతి, సంక్షేమ పథకాలను పూర్తిగా అమలుచేయలేని ఆర్థిక స్థితి ఈ ప్రభుత్వానికి తక్షణం సవాళ్లుగా నిలిచాయి. రాష్ట్రంలో బీజేపీ రథ చక్రాలు నలువైపులా వేగంగా పరుగులు తీస్తే.. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలోనూ మేమున్నామని బరిలోకి దిగితే రాజకీయ పునరేకీకరణ ఎలా వుంటుందనేది వేచి చూడాల్సిందే.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి