l రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టమన్నది నిజం కాదా
l ఇప్పుడు రేవంత్, కడియంలను కొట్టాలా?
l బీజేపీది దేవుళ్ల రాజకీయం అయితే.. నువ్వు చేస్తున్నదేంటి
l రేవంత్, కడియంలపై మంద కృష్ణ మాదిగ ఫైర్
వరంగల్, ఏప్రిల్26(విజయక్రాంతి): ‘రేవంత్వి బ్రోకర్ మాటలు. ఆయన ప్రజల అభిమానంతో సీఎం కాలేదు. రాజీనామా చేయకుండా పార్టీలు మారితే రాళ్లతో కొట్టమన్న రేవంత్.. ఇప్పుడు ఎవరిని కొట్టాలో చెప్పాలి’ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. హనుమకొండ హరిత హోటల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రేవంత్ బ్రోకర్ మాటల వల్ల మాదిగలు, మాలలు నష్టపోతున్నారని ఆరోపించారు. కడియం మాటలు నమ్మిన కేసీఆర్ ఎన్నో పదవులు కట్టబెట్టడమే కాకుండా తన కూతురుకు ఎంపీ టికెట్ కూడా ఇచ్చినప్పటికీ తన స్వార్థ రాజకీయాలకోసం పార్టీ మారాడని విమర్శించారు.
కడియం నమ్మకద్రోహి అని కేటీఆర్ అన్న దాంట్లో తప్పేమీ లేదని చెప్పారు. వరంగల్ స్థానం నుంచి తన కూతురును గెలిపించుకునేందుకు వంద కోట్లయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడని అన్నారు. దేవుని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపిస్తున్న సీఎం రేవంత్రెడ్డి చేస్తున్నదేమిటని ప్రశ్నించారు. తన మీద, తన కుటుంబ సభ్యుల మీద కాకుండా రేవంత్ కూడా దేవుళ్ల మీద ప్రమాణం చేయడమంటే దేవుళ్లు మాట్లాడరనే భావనతోనేనా అని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ విషయంలో ఆగస్టు 15 వరకు ఎందుకు.. ఎన్నికల కోడ్ అయిన తర్వాత జూన్లో కూడా రుణమాఫీ చేయవచ్చు కదా అని నిలదీశారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తుంటే ఇప్పుడు కొత్తగా వరంగల్ అభివృద్ధి బాధ్యత నాది అంటున్న రేవంత్రెడ్డి మాటలు బూటకమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు.