calender_icon.png 7 June, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి

07-06-2025 12:15:03 AM

కలెక్టర్ గౌతమ్

 మేడ్చల్, జూన్ 6 (విజయ క్రాంతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు గౌతం సూచించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో భాగంగా శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి మండలం జగన్ గూడ గ్రామంలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టరు రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారి దరఖాస్తులను కలెక్టరు నేరుగా పరిశీలించి వివరంగా వారికి సమాధానాలు ఇచ్చారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు.

భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. ధరణిలో పెండింగ్ ఉన్నవా, లేవా అని ముందుగా అడిగి తెలుసుకుని, ధరణిలో పెండింగ్ లో ఉంటే ధరణి లో ఉన్న నంబరు ఆ ధరఖాస్తు పై వేసి ఆన్ లైన్ లోనే వాటిని పరిష్కరించాలన్నారు.

దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. అనంతరం నర్సంపల్లిలో నిర్వహిస్తున్నరెవెన్యూ సదస్సును కూడా పరిశీలించి కలెక్టరు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.  ఈ సదస్సులో కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, జిల్లా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరసింహులు యాదవ్, తహసిల్దార్ నర్సింహారెడ్డి, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

మల్లంపేటలో అదనపు కలెక్టర్....

దుండిగల్ మండలం మల్లంపేటలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మల్కాజిగిరి ఆర్డీవో శ్యాం ప్రకాష్ తో కలిసి రెవెన్యూ సదస్సును పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.