calender_icon.png 22 December, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి జిల్లాలో రోడ్డు భద్రత ఫోర్స్

22-12-2025 12:32:21 AM

జనవరిలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి

నెలాఖరులోపు రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశం నిర్వహించాలి.

పరస్పర సమన్వయంతో  రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించాలి

ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు ,డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించాలి

జిల్లా కలెక్టర్‌లతో విడియో కాన్ఫరెన్స్ లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

నిజామాబాద్, డిసెంబర్ 21 : రోడ్డు ప్రమాదాలను నియంత్రించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి లతో కలసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్, అదనపు డీసీపీ బస్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గత సంవత్సరం తెలంగాణలో 25,934 రోడ్డు ప్రమాదాలు జరగగా ,7949 మరణాలు చోటుచేసుకున్నాయని అన్నారు.  ప్రమాదాలకు రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరిగినట్లు గుర్తించామని, ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతా చర్యలపై ప్రజలకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

రోడ్డు భద్రతపై ప్రతి జిల్లాలో రోడ్ సేఫ్టీ కమిటీలతో ఈ నెలాఖరు లోపు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.  ఆర్ అండ్ బి, రవాణా, ఆర్టీసీ, విద్యాశాఖ, పోలీస్, ట్రాఫిక్, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో రోడ్డు భద్రతా ఫోర్స్ వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో అధికారులతో కలిసి ఈ టీం అవగాహన కల్పించాలని ఆదేశించారు.

ఈ బృందాలకు జనవరి 26న ప్రశంసా పత్రాలతో సత్కరించాలన్నారు. పాఠశాలల్లో రోడ్డు నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తున్న చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి జిల్లా కలెక్టర్ లు చొరవ చూపాలని అన్నారు. యూనిసెఫ్ సహకారంతో విద్యార్థులకు ట్రాఫిక్ అవేర్నెస్ పై పాఠ్యాంశాలు చేర్చడం జరుగుతుందని తెలిపారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి, డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ప్రతి ఒక్కరికి రోడ్డు నిబంధనలపై  అవగాహన కల్పించడం జరుగుతుందని, స్క్రాపింగ్ పాలసీ ద్వారా ఫిట్నెస్ లేని వాహనాలను తొలగించడం జరుగుతుందన్నారు. 

ప్రమాదాలు జాతీయ రహదారుల పైనే అధికంగా అవుతుండడంతో రాత్రి వేళ వాహనాల పార్కింగ్, వాహనాల బ్రేక్ డౌన్ సమయంలో రేడియం రిఫ్లెక్టర్లు  ఉండేలా చూసుకోవాలని, వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారుల్లో, ప్రధాన నగరాల్లో ఎన్ఫోర్స్మెంట్ చేసి నిబంధనలను ఉల్లంఘించే వారికి చలానాలు, వాహనదారులు హెల్మెట్లు ధరించేలా చేయడం, సీటు బెల్ట్ పెట్టుకునే విధంగా చేయడం, ట్రిపుల్ రైడింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవడం వంటి చర్యల వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చని తెలిపారు.

రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు గోల్డెన్ అవర్ లో చికిత్స అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన క్యాష్లెస్ ట్రీట్మెంట్ సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, దీని ద్వారా బాధితుడికి ఏడు రోజుల్లో లక్షా 50 వేల వరకు ఉచితంగా చికిత్స  అందజేయబడుతుందని, రోడ్డు ప్రమాద బాధితులను తక్షణ సహాయం అందించిన వాహనదారులను ప్రోత్సహించడానికి రహవీర్ గుడ్ సమర్థన్ స్కీమ్ ద్వారా 25 వేల్ క్యాష్ అవార్డు అందించే పథకం రాష్ట్రంలో త్వరలోనే ప్రారంభం కానుందని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2025 లో రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేయటం ద్వారా జాతీయ రహదారి మంత్రి నితిన్ గడ్కరీ చేత అభినందనలు పొందామని గుర్తు చేశారు.  

2026 జనవరి లో జరిగే రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా హెల్మెట్ బైక్ ర్యాలీలు, వాకథాన్, రంగోలి, ముగ్గుల పోటీలు, రోడ్డు భద్రత ప్రతిజ్ఞలు, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, మోటార్ సైకిల్  చిన్న హెల్మెట్ స్టిక్కర్ అతికించడం ద్వారా అవగాహన కల్పించడం, కారు విండ్ స్క్రీన్కు చిన్న సీట్ బెల్ట్ను అతికించడం ద్వారా అవగాహన కల్పించడం, అన్ని పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, వ్యాస రచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, వక్తృత్వ పోటీలు, రోడ్లపై ఎన్ సీ సీ బృందాల ద్వారా అవగాహన,.ఆడియో విజువల్ మార్గాల ద్వారా అవగాహన, స్థానిక ఛానెల్స్, కేబుల్స్లో రోడ్డు భద్రత చర్చలు, సినిమా థియేటర్లలో అవగాహన స్లైడ్లు, వీడియోలు, హోర్డింగ్ల ద్వారా అవగాహన, కళాకారుల బృందాల చేత అవగాహన, ఆర్టీసీ బస్సు కండక్టర్ల ద్వారా కరపత్రాల పంపిణీ, బస్టాండ్లలో హోర్డింగ్లు, డిస్ప్లేలు, అనౌన్సర్ల ద్వారా అవగాహన ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ లకు సూచించారు.

తరచూ ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లని గుర్తించి వాటిని తొలగించాలని, అవసరమైన చోట ప్రధానంగా రోడ్డు కూడళ్లలో సంకేతాలను ఏర్పాటు చేయాలని అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, ఆర్టీఏ సభ్యులు, నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు పాల్గొనేలా రవాణా, పోలీస్, ఆర్టీసీ, ఇతర విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కింది స్థాయి నుండి రాజధాని వరకు విస్తృత అవగాహన ద్వారానే మరణాల రేటు తగ్గించవచ్చని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఓవర్ లోడ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఇటీవల ప్రమాదాలకు ప్రధాన కారణం ఓవర్ లోడ్ వల్లే అని అన్నారు. ప్రజల ఆస్తి, ప్రాణ నష్టాలను కాపాడే బాధ్యత మన అందరిపై ఉందని, జిల్లా కలెక్టర్లు రోడ్ సేఫ్టీ కమిటీ లతో సమావేశాన్ని ఏర్పాటు చేసి రవాణా శాఖ ఏర్పాటు చేసే కార్యాచరణలో పాల్గొనాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.