16-11-2025 09:28:04 AM
జనగామ,(విజయక్రాంతి): తాండూరు-వికారాబాద్ బస్సు ప్రమాదం మర్చిపోకముందే, మరో దారుణ ఘటన వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ గ్రామం సమీపంలో రోడ్డుపై ఆగి ఉన్న ఇసుకలారీని ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీ (TG07UK5469)ని వరంగల్ డిపో ఆర్టీసీ బస్సు (TG03Z0046) బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులు పులమాటి ఓం ప్రకాష్, దిండిగల్, నవదీప్ సింగ్ హనుమకొండ మృతి చెందారు. గాయాలైన ప్రయాణికులను పోలీసులు జనగామ ఏరియా హాస్పిటల్ కి తరలించారు. బస్సు డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.