calender_icon.png 10 October, 2025 | 9:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ పనిపట్టే కుట్ర!

10-10-2025 01:15:13 AM

  1. హైదరాబాద్‌లో పెంచిన బస్ చార్జీలను వెంటనే తగ్గించాలి 
  2. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు.. మగవాళ్లకు డబుల్ చార్జీలు 
  3. కార్మికులకు ఇచ్చిన హామీలు, సంస్థ సమస్యలను పరిష్కరించాలి 
  4. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 
  5. ఛలో బస్ భవన్ ఉద్రిక్తత 
  6. ఆర్టీసీ ఎండీకి మెమోరాండం అందజేత

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవా లని చూస్తూ, అంతిమంగా సంస్థను ప్రైవే ట్ పరంచేసే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరో పించారు. ఈ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేందుకు కుట్ర చేస్తోందని, ప్రైవేటుకు అప్ప గించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) బస్సు చార్జీల పెంపును తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియ ర్ నాయకులతో కలిసి ఛలో బస్ భవన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. హైదరాబాద్ నగర ప్రజలపై పెంచిన భారాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, సంస్థ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు.

ప్రభుత్వ బకాయిల పై వివరాలు అడగగా ‘మహాలక్ష్మి’ పథకానికి సంబంధించిన రూ. 1,353 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీసీ ఎండీ తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రూ. 9,246 కోట్ల ఆర్టీసీ గ్రాంటును విడుదల చేసినట్టు బీఆర్‌ఎస్ నేతలు తెలిపారు. ఆర్టీసీ ఎండీని కలిసిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. తెలంగాణలోని సామా న్య, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపేలా టికెట్ల ధరలు పెంచడం అన్యాయమన్నారు.

మహిళలకు ఉచిత బస్సును స్వాగతిస్తున్నామని, కానీ బస్సుల సంఖ్య పెంచాలన్నారు. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు అని చెప్పి మగవాళ్ల నుంచి డబుల్ వసూలు చేస్తున్నారని, విద్యార్థుల బస్ పాస్ చార్జీలు కూడా పెంచి ఒక్కో కుటుంబంపై పెనుభా రం మోపారని దుయ్యబట్టారు. ఒక చేతితో ఫ్రీ ఇచ్చి మరో చేతితో బస్ టికెట్ ధర పెం చడం దారుణమని మండిపడ్డారు. ఎల్ అండ్ టీని సక్సెస్‌ఫుల్‌గా తరిమివేసిన రేవంత్‌రెడ్డి సర్కారు ఇప్పుడు ఆర్టీసీని వదిలిం చుకోవాలని చూస్తున్నదని కేటీఆర్ ఆన్నారు.

సర్కస్ నడుపుతున్నారు..

ఈ ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయా లో తెలియదని, వారికి సర్కస్ నడపడమే తెలుసని కేటీఆర్ ఎద్దేవా చేశారు. శాంతియుతంగా బయటకు వచ్చి బస్సు ఎక్కి ఆర్టీసీ ఎండీకి లేఖ ఇస్తామంటే అడ్డగోలుగా పోలీసులను దింపి అందరినీ అరెస్టు చేసిందని మండిపడ్డారు. ఒకవైపు రాష్ర్టవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని, రెండు సంవత్సరా లుగా రాష్ర్టంలో ఉపాధి అవకాశాలు పూర్తి గా తగ్గాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో మరోసారి టికెట్ల రూపంలో చార్జీలు పెంచి భారం మోపడం పైన కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు సేవ కారణంగా నష్టం వస్తే, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి తప్ప ప్రజలపై మోపకూడదని హితవు పలికారు. ప్రజా రవాణా అనేది ప్రభుత్వ సామా జిక బాధ్యత అని, గతంలో కేసీఆర్ ప్రభు త్వం ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా భరించిందని గుర్తు చేశారు. ఆర్టీసీ లాభాల్లో ఉంటే బస్ చార్జీలు ఎందుకు పెంచారని సూటిగా ప్రశ్నించారు. 

ఉద్రిక్తత.. నేతల హౌస్ అరెస్టు, నిరసన

చార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నిర్వహించిన ‘ఛలో బస్సు’ కార్యక్రమం సం దర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఉద యం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు, ఇతర సీనియర్ నాయకుల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో, ప్రభుత్వం కేటీఆర్, హరీష్‌రావుతో పాటు పార్టీ నేతలకు బస్సు భవన్ వెళ్లేందుకు అనుమతిచ్చింది. దీంతో కేటీఆర్.. తలసాని శ్రీనివాస్ యాద వ్, పద్మారావు గౌడ్‌తో కలిసి సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్ బజార్ (రేతిఫైల్) బస్ స్టాప్ నుంచి బస్సులో ప్రయాణించారు.

హరీష్‌రావు మెహిదీపట్నం నుంచి బస్సులో ప్రయాణించి బస్ భవన్‌కు చేరుకున్నారు. ప్రయాణం సందర్భంగా బస్ ఛార్జీల పెంపు, ప్రయాణ సౌకర్యం, ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రయాణీకులను అడిగి తెలుసుకు న్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా కార్యకర్తలు, నాయకులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీఆర్‌ఎస్ ఆరోపించింది. చివరికి ప్రజాప్రతినిధులను మాత్రమే బస్సు భవన్‌లోకి అనుమతించారు. 

పోలీస్ నిర్బంధాలు మాకు కొత్త కాదు : హౌస్ అరెస్టు సందర్భంగా కేటీఆర్

కాంగ్రెస్ పాలకులు ప్రజాస్వామ్యబద్ధంగా బస్సులో కూర్చుని నిరసన తెలియజేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారని, ఈ ప్రభుత్వం తీసుకుంటున్న అర్థం లేని నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు. చార్జీల పెంపు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే రాష్ర్ట ప్రభుత్వం బీఆర్ ఎస్ పార్టీ నేతలు అందరిని ఎక్కడికి అక్కడ అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ పార్టీ నేతలను అరెస్టు చేయడం పైన ఉన్న ఆసక్తి రాష్ర్టంలో ముఖ్యంగా రాజధాని నగరంలో పెరిగిపోతున్న క్రైమ్ రేటును తగ్గించడం పైన పెడితే మంచిదని పోలీసులకు, ప్రభుత్వానికి హితవు పలికారు. పోలీసు నిర్బంధాలు బీఆర్‌ఎస్ పార్టీకి కొత్తేమీ కాదని స్పష్టం చేశారు. రాష్ర్ట ప్రభుత్వం చార్జీలను పెంచిందని వాటిని వెనక్కి తీసుకోవాలని బస్సులో వెళ్లి ఆర్టీసీ ఎండీకి లేఖ ఇస్తామంటే రాష్ర్ట ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు.

ప్రజా పాలనా.. ప్రజా పీడనా? : మాజీ మంత్రి హరీష్‌రావు

అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్‌ఎస్ పార్టీ ‘ఛలో బస్ భవన్’ కు పిలుపునిస్తే మాజీ మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇది అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనమని విమర్శించారు. 20 నెలల్లో ఐదు సార్లు బస్ చార్జీలు పెంచారని, భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారని ఎద్దేవా చేశారు.

వాహన లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి ప్రజల రక్తం పీల్చుతున్నారని మండిపడ్డారు. మెట్రో రైలును ఆగం చేశారని, ఆర్టీసీ ధరలు పెంచితే మెట్రో ఎక్కుతా రు అని రేవంత్ ఆలోచన అన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలనా?.. ప్రజా పాలనా లేక ప్రజా పీడననా అని ప్రశ్నించారు. టికెట్ ధరల పెంపుపై బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేదా అని నిలదీశారు.

ప్రభుత్వ అణచివేతలకు, నిర్బంధాలకు, దాడులకు బీఆర్‌ఎస్ పార్టీ అదరదు, బెదరదని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తూనే ఉంటాం.. ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ బస్‌ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని, ఉప్పల్, మియాపూర్ వర్క్ షాప్స్ అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. బస్ స్టాండ్‌లు కుదువబెట్టి రూ. 1500 కోట్లు తెచ్చారని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, ఆర్టీసీ ధరలు తగ్గించేవరకు బీఆర్‌ఎస్ ప్రజాఉద్యమం చేస్తుందని హెచ్చరించారు.