01-06-2025 07:29:17 PM
గోస్కుల అజయ్ - ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు..
హుజురాబాద్ (విజయక్రాంతి): ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు, నోట్బుక్స్, టైలు, బెల్టులు అమ్మకాలు జరుగుతున్నాయని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోస్కుల అజయ్ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజూరాబాద్ కేంద్రంలోని పాఠశాలలను ఏబీవీపీ సభ్యులు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. పాఠశాలల యాజమాన్యాలు స్టేషనరీ షాపులను పాఠశాలలోనే నిర్వహించి సరస్వతి నిలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చుతున్నాయని విమర్శించారు.
తమ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా స్కూల్ యాజమాన్యానికి చెందిన వ్యక్తుల నుంచే నోట్ బుక్స్ కొనాలని నిబంధనలు పెడుతున్నారని, బయట బుక్ స్టాల్ ధరలతో పోలిస్తే అధిక ధరలు వసూలు చేస్తున్నారని వాపోయారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఇటువంటి స్కూళ్లలో తనిఖీలు నిర్వహించి, పుస్తకాలు విక్రయిస్తున్న గదులను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనల కార్యక్రమాలుచేపడతామని హెచ్చరించారు.