06-06-2025 01:32:41 AM
- బడీడు పిల్లలను బడిలో చేర్పించడమే లక్ష్యం
- ఈనెల 19 వరకు నిర్వహణ
హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం శుక్రవారం(నేడు) ప్రారంభం కానుంది. ఈనెల 19 వర కు దీన్ని చేపట్టనున్నారు. బడిబాటలో భాగంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం బడిబాటను ఏటా విద్యాశాఖ నిర్వహిస్తోంది. బడీడు పిల్లలు, చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించి, విద్యార్థుల నమోదును పెంచడం దీని ముఖ్యఉద్దేశం. ఈనెల 12 నుంచి పాఠశాలలు
పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులందరూ పాల్గొని పాఠశాలల్లో ప్రవేశాలను పెంచనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రత్యేకతలను తల్లిదండ్రులకు గ్రామగ్రామాన తిరిగి వివరిం చనున్నారు. ‘తల్లిదండ్రులారా ఆలోచించండి! మన ప్రభుత్వ బడిలో మీ పిల్లలను చేర్చించండి!! బంగారు భవిష్యత్తును ఇవ్వం డి!!!’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం కరపత్రాన్ని ఇప్పటికే ప్రచురించింది. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, రెండు జతల యూని ఫామ్లులతోపాటు, రవాణా భత్యం చెల్లించనున్న అంశాలను పేరెంట్స్కు ఉపాధ్యా యులు వివరించనున్నారు.
రోజూవారీ కార్యక్రమాలు ఇలా..
-జూన్ 6వ తేదీన గ్రామసభ నిర్వహణ
7న ప్రతీ ఇంటిని సందర్శించి బడీడు పిల్లల గుర్తింపు
8 నుంచి 10 తేదీ వరకు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్వాడీ కేంద్రా ల సందర్శన, డ్రాప్ఔట్ పిల్లలను గుర్తిం చి బడిలో చేర్పించడం, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అందు బాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించడం.
11వ తేదీన జూన్ 6 తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన కార్యక్రమాలపై సమీక్ష.
12న అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించడం, అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాంల అందజేత
13న సామూహిక అక్షరాభ్యాసం, బాలల సభ
16న ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ దినోత్సవం
17న విలీన విద్య, బాలిక విద్యాదినోత్సవం నిర్వహణ
18న తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించడం
19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీల నిర్వహణ