06-10-2025 06:53:13 PM
హనుమకొండ (విజయక్రాంతి): విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ & టెక్నాలజికల్ మ్యూజియం(వి.ఐ.టి.ఎం.) ఆధ్వర్యంలో నవంబర్ 20, 21వ తేదీలలో జాతీయ సైన్స్ డ్రామా పోటీ నిర్వహించనున్నందున ఈనెల 17, 18వ తేదీలలో హైదరాబాదులోని రాష్ట్ర విద్య పరిశోధన మరియు శిక్షణ మండలి (ఎస్.సి.ఈ.ఆర్.టి) లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనడం కోసం 9వ తేదీ గురువారం నాడు హనుమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లష్కర్ బజార్ ప్రాంగణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో ఉదయం 9:30 గం.లకు సైన్స్ డ్రామా పోటీలను నిర్వహించనున్నట్లు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి డి.వాసంతి తెలిపారు.
30 నిమిషాలకు వ్యవధికి మించకుండా, 8 మంది పాత్రధారులు, రచయితతో కలిపి గరిష్టంగా పదిమంది ఒక ప్రదర్శనలో పాల్గొనవచ్చు. డ్రామాలో ఉపయోగించే దుస్తులు, అలంకరణ, సెట్టింగ్ లను విద్యార్థులే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రదర్శించే డ్రామా ముందుగా తెలుపబడిన 5 థీమ్ లలో 1) ఉమెన్ ఇన్ సైన్స్, 2) స్మార్ట్ అగ్రికల్చర్, 3) డిజిటల్ ఇండియా: ఎంపవరింగ్ లైఫ్స్, 4) హైజిన్ ఫర్ ఆల్, 5) గ్రీన్ టెక్నాలజీస్ లలో ఏదేని ఒకదానికి సంబంధించినదై ఉండాలి. మొదటి బహుమతి సాధించిన డ్రామాను రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. డ్రామాలో పాల్గొనే పాఠశాలలు వారి వివరాలను జిల్లా సైన్స్ అధికారి ఎస్. శ్రీనివాస స్వామికి 9490112848 చరవాణి ద్వారా తెలియజేయాలని సూచించారు.