20-12-2025 09:02:48 PM
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
హనుమకొండ,(విజయ క్రాంతి): విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి సైన్స్ ఫెయిర్ లు దోహదపడతాయని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. పాఠశాల విద్యాశాఖ హనుమకొండ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన శనివారం హనుమకొండ సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ ఆవరణలో వైభవంగా ముగిసింది.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్.వి.గిరి రాజ్ గౌడ్ సబాధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగాఎమ్మెల్యే పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సైన్స్ ద్వారా రుగ్మతలను, మూఢనమ్మకాలను పారద్రోలాలని కోరారు. సాంకేతిక పరికరాలు అనేకం అందుబాటులోకి రావడంతో విద్యార్థులలో ఆలోచన శక్తి తగ్గి వాటి మీదనే ఆధారపడటం ఎక్కువైందన్నారు. ప్రకృతిని నాశనం చేస్తుండడం వల్లే అనేక రకాలైన అనర్ధాలు వస్తున్నాయన్నారు. ఇటీవల హనుమకొండ నగరానికి అకస్మాత్తుగా వచ్చిన వరదలే ఉదాహరణగా చెప్పారు.
విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందించారు. ఉపాధ్యాయుల చేతిలో మరియు పోలీసుల చేతిలో బెత్తం పోయిన కారణంగా విద్యార్థులలో క్రమశిక్షణ తగ్గుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ మూడు రోజులపాటు జిల్లాస్థాయి విద్యా ,వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జిల్లాలో ప్రతిభావంతమైన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు.
చివరగా రాష్ట్రస్థాయికి ఎంపికైన ఇన్స్పైర్ మరియు జిల్లా సైన్స్ ఫెయిర్ విజేతలకు శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్,జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస స్వామి, సీఎంఓ బద్దం సుదర్శన్ రెడ్డి, డిసిఇబి కార్యదర్శి రామ్ ధన్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం గౌడ్ , సెయింట్ పీటర్స్ విద్యాసంస్థల అధినేత నారాయణరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ ప్రిన్సిపల్ హరిత, ట్రస్మా అధినేత సతీష్, ఎంఈఓ లు నెహ్రూ నాయక్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.