calender_icon.png 20 December, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత సామాజిక బాధ్యత

20-12-2025 09:00:32 PM

రోడ్డు భద్రత నియమాలు అందరూ పాటించాలి

రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు-2026 పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,(విజయ క్రాంతి): రోడ్డు భద్రత సామాజిక బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు-2026 పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, రవాణా, ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేష్ ఎం భగవత్, జాతీయ రహదారుల, ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్య శాఖా అధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం శనివారం నిర్వహించగా,

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.ఈ సందర్బంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గతంలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించేవారని, గత ఏడాది నుంచి మాసోత్సవాలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రోజూ రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 20 మంది మృతి చెందుతున్నారని వెల్లడించారు. గత ఏడాది 7,949 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని తెలిపారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై ఈ నెల ఆఖరులోగా జిల్లా స్థాయిలో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించాలని,

కార్యక్రమం నిర్వహణ పై యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు.నేషనల్ హై వే, ఆర్ అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా అధికారులు సంయుక్తంగా జిల్లాలోని బ్లాక్ స్పాట్లను గుర్తించాలని సూచించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. భద్రత మాసోత్సవాలపై విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సీసీ, ఎన్ఎస్ఎస్, స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాలని, నెల రోజులపాటు ట్రాఫిక్ వాలంటీర్లను నియమించాలని సూచించారు.

అనంతరం వారిని అభినందిస్తూ సర్టిఫికెట్ అందించాలని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు దగ్గరలోని ఆసుపత్రిలో వైద్యం అందించాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసిందని, రోడ్డు ప్రమాద బాధితుల వైద్యానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన వారికి పారితోషికం ఇస్తుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.

డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం: ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్బంగా జిల్లాలోని రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జిల్లాలోని ఆయా విద్య సంస్థల్లో విద్యార్థులకు వ్యాస రచన, డ్రాయింగ్ ఇతర పోటీలు చేపడుతామని పేర్కొన్నారు. స్కూల్ మేనేజ్మెంట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తామని వివరించారు. నేషనల్ హై వే, ఆర్అండ్ బీ, పీఆర్, పోలీస్, రవాణా శాఖా అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి, బ్లాక్ స్పాట్లు గుర్తిస్తామని, వాటి పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తామని తెలిపారు. 

వీడియో కాన్ఫరెన్స్ లో ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా రవాణా శాఖా అధికారి లక్ష్మణ్, జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యుడు సంగీతం శ్రీనాథ్, పీఆర్ ఈఈ సుదర్శన్ రెడ్డి, ఆర్అండ్ బీ డీఈ శాంతయ్య, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, అన్వేష్, జిల్లా వైద్యాధికారి రజిత, విద్య శాఖా అధికారులు, ట్రాఫిక్ పోలీస్ లు తదితరులు పాల్గొన్నారు.