తెలంగాణాలో బుద్ధ నిర్వాణ శిల్పం
ఆదిలాబాద్ జిల్లా భీంసారిలో తెలంగాణ చరిత్ర బృందం గుర్తింపు
హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా భీంసారి గ్రామంలో ఒకచోట నిలిపివున్న రాతిస్తంభానికి నలువైపుల చెక్కిన అర్థశిల్పాలలో బుద్ధనిర్వాణ శిల్పముండడాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్రోపన్యాసకుడు రొడ్డావార్ పృథ్వీరాజ్ గమనించారు. ఈ శిల్పస్తంభాన్ని పరిశీలించిన చరిత్రబృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ ‘శయనించివున్న బుద్ధుడు కుడివైపుతిరిగి పడుకున్నాడు, కుడిచేయిని తలాపుగా పెట్టుకున్నాడు.
ఇది ‘పరినిబ్బానసుత్త’లో వివరించినట్లు బుద్ధనిర్వాణ శిల్పమే’ అని అన్నారు. ఈ శిల్పాన్ని చూసిన స్థపతి, చరిత్రకారులు డా. శివనాగిరెడ్డి ‘బుద్ధనిర్వాణ శిల్పమేనని నిర్ధారించారు. గతంలో వేములవాడ భీమేశ్వరాలయం అధిష్టానం మీ ద, ముదిగొండలో లభించిన పాలరాతి ఫలకం మీద తెలంగాణాలో బుద్ధనిర్వాణ శిల్పాలు లభించాయని వివరించారు.
తక్కిన మూడింటి లో ఒకటి విష్ణుశయనమూ ర్తి, రెండు ఖడ్గధారి రాజోచిత ఆహార్యంతో వీరుడు, మూడు ఉమాలింగనమూర్తి అర్ధశిల్పాలున్నాయి. విభిన్నమైన ధర్మశిల్పాలు ఒకే రాతిస్తంభం మీద చెక్కడం అపూర్వం. ఇటువంటి శిల్పస్తంభం తెలంగాణాలో మొదటిసారిగా కనిపించింది.






