22-09-2025 12:06:20 PM
ఇద్దరు అక్కడికక్కడే మృతి.
రాజాపూర్: మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్(Rajapur) మండల కేంద్రం పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆకాష్ బ్రాండ్ హోటల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తకోట మండలం పాన్ గల్ కు చెందిన రంజిత్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి తన మరదలును హైదరాబాద్ డ్రాప్ చేయడానికి తన కారులో వెళుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాదు నుండి జడ్చర్ల వైపు వస్తున్న ఒక కారు డ్రైవర్ నిద్ర మత్తులో డివైడర్ ను ఢీ కొట్టి ఇవతలి వైపు వెళుతున్న రంజిత్ కుమార్ రెడ్డి కారుపై ఎగిరి పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న రంజిత్ కుమార్ రెడ్డి, అతని మరదలు కారులోనే మృతి చెందారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.