22-09-2025 01:36:06 PM
జీఎస్టీ మార్పుల వల్ల.. రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయి
హైదరాబాద్: సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. మొత్తం రూ. 819 కోట్లను సింగరేణి కార్మికులకు(Singareni workers) బోనస్ గా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దేశానికి వెలుగులు ఇవ్వడంలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర, దేశ ఆదాయంలో సింగరేణి సంస్థ కృషి ఉందని సూచించారు. సింగరేణిలో 41 వేల శాశ్వత ఉద్యోగులకు, 30 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులకూ బోనస్ పంపిణీ చేశామని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాంట్రాక్టు ఉద్యోగులకు బోనస్ పంపిణీ చేసినట్లు తెలిపారు.
30 వేల మంది కాంట్రాక్టు కార్మికులకు రూ, 5500 చొప్పున బోనస్ ఇచ్చామన్నారు. లాభాల్లో కొంత మొత్తాన్ని భవిష్యత్ లో పెట్టుబడులకు కేటాయించిందన్నారు. భవిష్యత్ లోనూ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ దీపావళికి ఉంటుందన్నారు. సింగరేణి, విద్యుత్ సంస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయని చెప్పిన సీఎం జీఎస్టీ(Goods and Services Tax) మార్పుల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోతున్నాయని వెల్లడించారు. రాష్ట్రాలు కోల్పోతున్న ఆదాయాన్ని కేంద్రం భర్తీ చేయాలని కోరారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని రాష్ట్రాలపై భారం వేయటం సరికాదని సూచించారు. వచ్చే ఐదేళ్లపాటు కేంద్రం వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు.