01-12-2025 06:45:43 PM
- ఇక ఒంటి గంటకే వైన్స్ షాపులు తెరుచుకుంటాయి..
- ఎమ్మెల్యే ఆదేశాలకు మద్దతిస్తున్న దుకాణాల యజమానులు..
మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి మునుగోడు నియోజకవర్గం ఆదర్శంగా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బెల్ట్ షాపులను తీసి వైన్స్ లు తెరుచుకునే సమయాన్ని కూడా మార్చారు. మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో సూచనల ప్రకారమే మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే విక్రయాలు మొదలు పెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు.
ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగా దొరికే మద్యం వల్ల ఎంతోమంది యువకులు తాగుడుకు బానిసై తమ జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్న, విచ్చలవిడిగా మద్యం సేవించి గ్రామాలలో అకారణంగా ఘర్షణలకు తావిస్తున్న తీరును, మద్యానికి బానిసై అనారోగ్యాలకు గురై ప్రజలు చనిపోతున్న సంఘటనలు చూసి ఎమ్మెల్యే బెల్ట్ షాపులను నిర్మూలించారు. బెల్ట్ షాపులకు నిర్మూలించిన గ్రామాలకు అభివృద్ధి నిధులు కేటాయించారు. మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని సిండికేట్, ఊరి బయటే మద్యం విక్రయాలు, పర్మిట్ రూంలకు అనుమతించొద్దని పలు సూచనలు చేశారు.
మద్యం షాప్ టెండర్లు దక్కించుకున్న యజమానులతో ప్రత్యేక సమావేశం...
మద్యం షాపులు దక్కించుకున్న యజమానులతో హైదరాబాదులోని తన నివాసంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మద్యం షాపులను మధ్యాహ్నం 1:00 తర్వాత తెరవాలని, 6 గంటల నుండి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని సూచించారు. అంశాలకు లోబడి మద్యం షాపులు నిర్వహిస్థామని మాట ఇచ్చారు మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు.. నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. మండలాలలో ఊరి బయటే మద్యం దుకాణాలను ప్రారంభించి మధ్యాహ్నం 1:00 గంటల నుండి విక్రయాలు ప్రారంభించారు.
రాజగోపాల్ రెడ్డి గసంకల్పానికి మద్దతుగా దుకాణాల యజమానులు...
కొత్తగా మద్యం టెండర్ల ప్రక్రియ మొదలవగానే టెండర్ల ప్రక్రియలోనే మునుగోడులో మద్యం షాపుల నిర్వహణ, మద్యం నియంత్రణపై సూచనలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. మద్యం షాపులు నిర్వహించాలనుకునే వాళ్ళు తాము సూచించిన పద్ధతిలోనే నిర్వహించాలని బహిరంగంగా చెప్పారు.. ప్రజలను ఆరోగ్యంగా, ఆర్థికంగా చిన్నబిన్నం చేస్తున్న మద్యం అధిక తాగుడుకు కళ్లెం వేయడానికి మద్యాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న నిర్ణయానికి మద్యం షాపుల యజమానులు తోడ్పాటును అందిస్తూ మద్యం షాపులను నిర్వహించడానికి ముందుకొచ్చారు.. మద్యం షాపుల నిర్వహణ నియంత్రణ విషయంలో ఎమ్మెల్యే సంకల్పానికి మద్యం షాపుల యజమానులు అందిస్తున్న తోడ్పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శప్రాయంగా మారనున్నది.