09-11-2025 07:35:55 PM
ఇంద్రవెల్లి (విజయక్రాంతి): నేరాలను అదుపు చేస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు, రోడ్డు ప్రమాదాలను సైతం అరికట్టడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కృషి చేస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చుతూ తమ సామాజిక బాధ్యతలు చాటుకుంటున్నారు జిల్లా పోలీసులు. ఆదివారం ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామ సమీపంలోని మెండపల్లి ఎక్స్ రోడ్డు వద్ద ఏర్పడిన గుంతతో ఇటీవల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు చనిపోవడంతో పాటు ఎంతోమందికి గాయాలైన సంగతి తెలిసిందే.
దీంతో ఇంద్రవెల్లి ఎస్సై సాయన్న స్పందించి తన సొంత ఖర్చులతో మొరం వేయించి, రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చారు. ఈ సందర్భంగా ఎస్సై సాయన్న మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు. బైక్ నడిపే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.