28-11-2025 06:31:17 PM
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రాబోయే పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతలకు ఏగాతం కలిగించే వ్యక్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ రోహిత్ రాజ్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లాలోని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న అధికారులతో ఎస్పీ మాట్లాడుతూ రాబోయే పంచాయితీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులందరూ బాధ్యతగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు.
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఓటర్లను నగదు, మద్యం, ఇతర వస్తువులతో ప్రలోభ పెట్టే వారిపై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కింద కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ఉక్కుపాదం మోపాలన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ర్యాలీలు, సభలు, ఇతర ప్రచార కార్యక్రమాలకు సంభందించి ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు కచ్చితంగా సంభంధిత అధికారుల అనుమతి తీసుకోవాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను గమనిస్తూ ఉండాలని తెలిపారు.
అనంతరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి అధికారులందరూ బాధ్యతగా కృషి చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా నిత్యం ప్రజలకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని కోరారు. వర్టికల్స్ వారీగా పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలతో రోడ్లపై సంచరిస్తూ నేరాల నిరోధనకు కృషి చేయాలన్నారు.