31-05-2025 05:05:54 PM
అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో 8 కోడెలు మృతి
ఈ రోజు ఏమి గోవులు మృతి చెంద లేదు
గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేయవద్దు
ఐదుగురు పశువైద్యాధికారులతో నిత్యం గోవులకు వైద్య చికిత్సలు
త్వరలో కోడెల పంపిణీకి ఏర్పాట్లు
తిప్పాపూర్ గోశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) ఆదేశించారు. వేములవాడ తిప్పాపూర్ లోని గోశాలను కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోవులకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.... అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో 8 కోడెలు మృతి చెందాయని తెలిపారు.
మిగతా ఏ కోడెలు మృతి చెందలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అనవసరపు అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. పశు వైద్యాధికారులు అంజిరెడ్డి, రాహుల్, అభిలాష్, సాహితి, దీప్తి ఆద్వర్యంలో కోడెలకు నిరంతరం వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కోడెల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. నిత్యం వాటికి అందించే దాణా, మేత విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. నిత్యం పచ్చి గడ్డి పెట్టాలని, గోశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. త్వరలో కోడెల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.