25-04-2025 02:17:13 AM
యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 24 ( విజయ క్రాంతి ) : జూన్ 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసుల పరిష్కారానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పెండింగులో ఉన్న 691 చెక్ బౌన్స్ కేసులను గుర్తించి వారికి నోటీసులు జారీ చేసే ప్రక్రియ ప్రారంభించామన్నారు.
బ్యాంకు అధికారులచే ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కేసుల పరిష్కారానికి తీసుకొనే చర్యలకై సూచనలు చేయడమైనది. చెక్ బౌన్స్ కేసులలో ఇరు పక్షాలు ఈ లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.
ప్రత్యేక కౌన్సెలింగుకై మే 5వ తేదీ నుండి 19వ తేదీ వరకు ప్రీ సిట్టింగులు నిర్వహించబడుతాయని తెలిపారు. ఇట్టి ప్రీ సిట్టింగులలో లోక్ అదాలత్ సభ్యులను, మీడియేషన్ న్యాయవాదులు కౌన్సెలింగు నిర్వహించటానికి భువనగిరి , రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్ , యాదాద్రి కోర్టుల న్యాయమూర్తులకు తగిన సూచనలు చేసినట్లు తెలిపారు.