26-08-2025 07:17:47 PM
అడ్డుకున్న శేరిగూడ గ్రామస్తులు
ఇబ్రహీంపట్నం: దశాబ్దల చరిత్ర కలిగిన కాలువలను, కుంటలను ఏది వదలకుండా అక్రమార్కులు చెరబడుతున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధి శేరిగూడ గ్రామంలోని శ్రీ దత్త ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యం కాలేజీ పక్కన ఉన్న కాల్వను ఆక్రమించి చదును చేసేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తాత ముత్తాతల నాటి కాలువను, దీనికి అనుకుని ఉన్న రోడ్డును శ్రీ దత్త కళాశాల యాజమాన్యం అక్రమంగా ఆక్రమించి, ఈ రోడ్డులో అర్ధరాత్రి బోర్ సైతం వేశారని ఆరోపించారు. 33 ఫీట్ల వెడల్పుతో ఉన్న కాలువ ప్రస్తుతం 5 ఫీట్లకు కుంచించుకు పోయిందన్నారు. అదేవిధంగా దీనికి అనుకొని ఉన్న రోడ్డుపై నుంచి బావుల వద్దకు వెళ్లేవారు, పశువుల, గొర్రెల కాపర్లు ఇదే దారిలో యేండ్ల నాటి నుంచి వెళ్లేవారని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులకు గ్రామస్తులు సమాచారం ఇవ్వగా ఇరిగేషన్ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్ గౌడ్ అక్కడకు చేరుకొని స్థలాన్ని పరిశీలించి కాలేజీ యాజమాన్యం చేస్తున్న పనిని నిలిపివేశారు. ఇదే విషయమై ఇరిగేషన్ డిఈ చెన్నకేశవ రెడ్డిని వివరణ కోరగా రెండు మూడు రోజులలో మండల సర్వేయర్ తో సర్వే నిర్వహిస్తామని, ఆక్రమణకు గురైనట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని అయన పేర్కొన్నారు.