27 March, 2026 | 9:41 PM

రామనామంతో మారుమోగిన కీతవారిగూడెం

27-03-2026 07:52 PM

* రాములవారు కొందరివాడు కాదు అందరివాడు అని నిరూపించిన గ్రామస్తులు

* నాలుగు కళ్యాణ వేదికలు

* గ్రామంలో చర్చనీయాంశం

గరిడేపల్లి: చైత్ర శుద్ధ నవమి సందర్భంగా మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాలు శుక్రవారం భక్తి పరవశంలో ఘనంగా నిర్వహించారు.గ్రామమంతా జైశ్రీరామ్ అంటూ రామనామ స్మరణతో మారుమోగింది. గ్రామంలో జరిగిన ఊరేగింపులో కోదాడ డిఎస్పి శ్రీనివాసరెడ్డి,గరిడేపల్లి ఎస్ఐ చలిగంటి నరేష్ పల్లకి మూసి తన భక్తిని చాటుకున్నారు. ప్రతి కూడలిలో ప్రత్యేక పూజలు,భజనలు,అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు అందించారు.

అయితే గతంలో నిర్మించిన రాముల వారి ఆలయం వివాదం కారణంగా ఒకే వేదికపై జరిగే కళ్యాణం ఈసారి వర్గాలుగా విడిపోయి నాలుగు చోట్ల నిర్వహించడం గ్రామంలో చర్చనీయాంశమైంది. రాముడు అందరివాడు అనే భావంతో నిర్వహించినా ఐక్యతకు భంగం కలిగిందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.ఇకనైనా గ్రామ పెద్దలు వివాదాలకు తెరదించి భవిష్యత్తులో ఐక్యతతో పండుగలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.