31-07-2025 12:00:00 AM
నిజామాబాద్ జులై 30: (విజయ క్రాంతి): నిజామాబాద్ సిపి గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్య తనదైన శైలిలో పోలీసులను పనితీరును గాడిలో పెడుతున్నారు. చిన్న ఆరోపణ వచ్చినా కూడా ఉపేక్షించకుండా పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఇద్దరు సిబ్బందిపై బదిలీ క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా వేటు పడింది.
కానిస్టేబుల్ మరో హోంగార్డును హెడ్ క్వార్టర్కు అటాచ్ చేస్తూ సీపీ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. జనరల్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్న ఫయాజ్, ట్రాఫిక్ సీఐకు డ్రైవర్గా పని చేస్తున్న హోంగార్డు షాకీర్ హెడ్ క్వార్టర్కు అటాచ్ అయిన వారిలో ఉన్నారు. ప్రత్యేకించి ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.
డ్రంకన్ డ్రైవ్ కేసులు వాహనాల తనిఖీ సమయంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు కొద్ది నెలలుగా ఉండడంతో ఈ వేటు పడింది.ముఖ్యంగా వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానుల నుంచి నెలనెలా ముక్కుపిండి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. అయితే అధికారుల అండదండలు లేకుండా సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ స్టేషన్ పరిధిలో వచ్చిన వసూళ్ల ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. .