రాష్ట్రానికి, ప్రజలకు రక్షకులుగా నిలవండి
రాష్ట్ర ఐటి శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు
ఎస్పీఎఫ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడేట్లకు మెడల్స్, బహుమతుల ప్రధానం
పటాన్ చెరు, విజయక్రాంతి: పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడేట్లు దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు రక్షకులుగా నిలవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. అమీన్ పూర్ పరిధిలోని ఎస్పీఎఫ్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 265 మంది క్యాడేట్ల పాసింగ్ అవుట్ కు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ క్యాడేట్ పోలీసులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత నైపుణ్యం కలిగిన మీకు సచివాలయం భద్రతతో పాటు ప్రముఖ దేవాలయాల భద్రత రంగాల్లో పెట్టడం జరుగుతుందన్నారు. క్రమశిక్షణతో మీ బాధ్యతలు నిర్వర్తించాలాన్నారు.
మీరు వేసుకున్న యూనిఫామ్ మీ అధికారానికే కాదని మీ బాధ్యతకు చిహ్నం అని అన్నారు. ప్రభుత్వం మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, మీ సంక్షేమం మా బాధ్యత అన్నారు. తెలంగాణ ఆస్తులను కాపాడటమే కాకుండా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 50 వేల పైచిలుకు ఉద్యోగాలను నెలకు సగటున 5 వేల చొప్పున కల్పించామన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడేట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వారికి మెడల్స్, జ్ఞాపకాలు అందజేశారు. రాష్ట్రానికి దేశానికి సేవ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎంపికైన వారు ఉపయోగించు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు, క్యాండెట్ల కుటుంబీకులు పాల్గొన్నారు.






