03-07-2025 12:53:13 AM
స్థానిక సంస్థలు ఎప్పుడైనా రావచ్చు..
ఎమ్మెల్యే మురళి నాయక్
మహబూబాబాద్, జూలై 2 (విజయ క్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు.. అలర్ట్ గా ఉండండి, మానుకోట నియోజకవర్గంలో 90 శాతానికి పైగా ఎంపిటిసి, జడ్పిటిసి స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలుపొందే విధంగా సన్నద్ధం కావాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో రెండవ అతిపెద్ద పట్టణంగా కేసముద్రం పట్టణాన్ని తీర్చిదిద్దడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. వేం నరేందర్ రెడ్డి కృషితో 133/11 , రెండు 33/11కేవీ విద్యుత్ సబ్ స్టేషన్లు, 30 పడకల ఆసుపత్రి, పట్టణంలో రెండు రోడ్ల విస్తరణ, ఆదర్శ నగర్, ఎర్రగడ్డ కాలనీ బ్రహ్మం తండా కాలనీ బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని, ఆ పనులకు ఈనెల 6న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు.
పట్టణంలో నిర్వహించే సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సభకు నియోజకవర్గ పరిధి నుంచి 15 వేల మందికి తగ్గకుండా జన సమీకరణ చేయాలని క్యాడర్ కు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం సభాస్థలి, హెలిప్యాడ్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, డివైసిసి అధ్యక్షుడు సురేష్, కాంగ్రెస్ నాయకులు గుగులోతు దసృ నాయక్, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, ఆర్టిఏ మెంబర్ రావుల మురళి, సొసైటీ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, కూరెల్లి సతీష్, బానోతు చిన్న వెంకన్న , వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.