30-05-2025 01:53:50 AM
విద్యార్థులను ఆకట్టుకునేలా.. ఆటపాటలతోనూ బోధన
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): పాఠ్యపుస్తకంలో ఉన్నది ఉన్న ట్లుగా బోధించే మూసపద్ధతి బోధనకు ఉపాధ్యాయులు స్వస్తి పలుకనున్నారు. వినూత్న పద్ధతుల్లో ఇకనుంచి విద్యార్థులకు బోధించనున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి బోధనా పద్ధతుల్లో విద్యా శాఖ మార్పులు తీసుకురానుంది. అందుకు ఉపాధ్యాయులను సంసిద్ధం చేసింది. గతంలో కంటే పూర్తి భిన్నంగా తరగతి గదుల్లో విద్యార్థులకు బోధించే లా ఇటీవల టీచర్లకు ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు.
పుస్తకంలోని పాఠాన్ని ఏదో మొక్కుబడిగా చెప్పేశామని కాకుండా ఉపాధ్యాయులు సరికొత్త పద్ధతులను అమలుచేయాలని ఆదేశించారు. వీలైతే ఆటాపా టలతో బోధించాలని సూచించారు. పిల్లవాడిని ఆకర్షించేలా, సులువుగా అర్థమయ్యేలా బోధనా పద్ధతులను అవలంబించాలని పేర్కొన్నారు. ఆక్టివిటీస్ బేస్గా విద్యాబోధన ద్వారా విద్యార్థులకు సులువుగా అర్థమవ్వడమే కాకుండా ఎక్కువ కాలం గుర్తుండి పోతుంది.
ఇందుకు టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాలని అధికారులు సూచించారు. కేవలం బ్లాక్బోర్డుపై సుద్దముక్కతో పాఠాలు చెప్పకుండా అవసరమైన చోట బోధనోపకరణాలను ఉపయోగించి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధనా పద్ధతులను అమలుచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా పద్ధతులు, ఎన్రోల్మెంట్పై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈనేపథ్యంలోనే విడతల వారీగా ఉపాధ్యాయులు, ఎంఈవోలకు శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే ఉపాధ్యా యుల శిక్షణ పూర్తి కాగా, ప్రస్తుతం ఎంఈవోల శిక్షణ కొనసాగుతోంది. త్వరలో ప్రతీజిల్లా నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ టీచర్లను ముగ్గు రి చొప్పున ఎంపిక చేసి సదస్సును నిర్వహించనున్నారు.
ప్రభుత్వ బడుల్లో తగ్గుతున్న ఎన్రోల్మెంట్..
ఒకవైపు తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం సన్నగిల్లడం, మరోవైపు ప్రైవేట్ బడులు ఆకర్షిస్తుండటంతో సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ ప్రతిఏటా పడిపోతోంది. చదువుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా నిధులు ఖర్చుచేస్తున్నా ఎన్రోల్మెంట్ పడిపోతుండటంతో ప్రభు త్వ స్కూళ్ల మనుగడ ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 42,900బడులుంటే అందులో 30,022 (70 శాతం) ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో ఎన్రోల్మెంట్ కేవలం 27.8లక్షలు (38.11 శాతం విద్యార్థులు) మాత్రమే ఉన్నారు.
ఇక ప్రైవేట్ స్కూళ్లు 12,125 (28.26 శాతం) ఉండగా, వీటిలో మాత్రం 44.31లక్షలు (60.75 శాతం) మంది విద్యార్థులున్నారు. గత ఆరేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య క్రమంగా తగ్గుతుంటే..ప్రైవేట్ స్కూళ్ల లో పెరుగుతోంది. దీంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు కోత పడుతోంది. సమగ్రశిక్ష ప్రాజెక్టు కింద రాష్ట్రాలకు కేంద్రం నిధులిస్తోంది. అయితే వీటిని సకాలంలో వివిధ కార్యక్రమాలకు ఖర్చుచేయాల్సి ఉం టుంది. వాటిని ఖర్చు చేయకుంటే నిధుల్లో కేంద్రం కోత విధిస్తుంది.
ఈనేపథ్యంలోనే 2025 విద్యాసంవత్సరం నుంచి ప్రత్యే క కార్యాచరణ తీసుకున్న విద్యాశాఖ అటు ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెంచేందుకు, వినూత్న పద్ధతుల్లో బోధించేందుకు ప్రణాళికలు రచించింది. జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఉపాధ్యాయులు, అధికారులు, అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొని బడీడు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించనున్నారు.
ప్రతీ బడిలో ఎన్రోల్మెంట్ సంఖ్య పెంచేలా ఉపాధ్యాయులు, ఎంఈవోలు కృషిచేయాలని ఆదేశించారు. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరం నుంచి జిల్లాకు 30 చొప్పున ప్రీప్రైమరీ తరగతులు సైతం ప్రారంభించాలని విద్యాశాఖ ఇప్పటికే భావించింది. అయితే వీటికి సంబంధించిన ఉత్వర్వులు జారీ కావాల్సి ఉంది.