జంగంకుంట ఆక్రమణలపై కఠిన చర్యలు
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
అమీన్పూర్, జూలై 21 :అమీన్పూర్ మండలం సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్క్ పరిధిలోని జంగంకుంట పరిధిలో ఇటీవల కొందరు మట్టి నింపుతూ ఆక్రమణలకు పాల్పడడంపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల దయారా గ్రామస్తులు ఈ అంశం పైన ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా.. మంగళవారం ఉదయం స్థానికులతో కలిసి కుంటను పరిశీలించారు. కుంటకు ఒక వైపు నుండి మట్టి నింపుతూ అక్రమించేందుకు ప్రయత్నించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక తహసీల్దార్ తో ఫోన్ లో మాట్లాడి.. కుంటను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కుంట పరిరక్షణకు సంపూర్ణ సహకారం అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు రాజు, భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 30న ప్రతిష్టాపన కార్యక్రమం
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతల ఆలయాలలో ఆగస్టు 30న ప్రతిష్టాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయంలో దుర్గమ్మ, భూలక్ష్మమ్మ, చిత్తారమ్మ దేవతల విగ్రహాలను ప్రతిష్టించబోతున్నట్లు తెలిపారు. పనులు తుది దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు. మరో రెండు వారాల్లో పనులు పూర్తిచేసి.. ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.






