చట్ట విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : చట్ట విరుద్ధంగా ప్రవేట్ ఆసుపత్రులు గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, సూర్యాపేటలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనల రిజిస్ట్రేషన్ చేయాలన్నారు.
అర్హతలు వున్నవాటికి సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు నిర్వహించినచో వాటిని మూసి వేయాలన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే ఆసుపత్రులపై, వాటి ప్రాంగణాలను సీల్ చేయడంతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నవీకరించబడిన రికార్డులు, వైద్య బృందాలచే క్రమమైన తనిఖీలు, అమలు కోసం పోలీసుల సమన్వయంతో నిర్వహించాలన్నారు.
తనిఖీ చేసిన 10 రోజుల్లోగా నిబంధనలను పాటించని ఆసుపత్రులను సీల్ చేయడానికి చర్యలు తీసుకోవాలి అన్నారు. పిసిపిఎన్ డిటి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. తదుపరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా,,పెండెం వెంకట రమణ మాట్లాడుతూ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ నుండి 23 ప్రొవిజినల్, 28 పర్మినెంట్ అనుమతులు ఇచ్చామని, 31 ఎస్టాబ్లిష్మెంట్స్ తిరస్కరించమని, అర్హతలేని వైద్యుల స్కానింగ్ సెంటర్ మూసివేశామని తెలిపారు.
ఈ కారక్రమoలో అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, జిజి హెచ్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, డా,, ప్రవీణ్ కుమార్, డా,, వెంకటేశ్వర్లు, ఐఎంఏ ప్రెసిడెంట్ డా,,ఆనంద్, డి డబ్ల్యు ఓ నర్సింహా రావు, డీఈఓ అశోక్, డిప్యూటీ డిఎంహెచ్వో డా,, చంద్ర శేఖర్, డా,,మాధవ్ కుమార్, ప్రోగ్రాం అధికారులు డా,, కోటి రత్నం, డా,, ప్రసిద్ద్, డా,, నాజియా, డా,, శ్రీశైలం, డిప్యూటీ డి ఇ ఎం సంజీవ్ రెడ్డి, ఉపేందర్, కల్యాణ్ పాల్గొన్నారు.




