విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి
ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిల్లీ భాను ప్రసాద్
కందుకూరు,(విజయక్రాంతి): విద్యార్థుల 8,500 కోట్ల స్కాలర్షిప్&ఫిజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిల్లీ భాను ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కందుకూరు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలోని విద్యారంగానికి కనీసం 15% బడ్జెట్ కేటాయించాలని, విద్యారంగం సమస్యలపై వెంటనే రాష్ట్రం స్పందించాలన్నారు.
విద్యార్థుల సమస్యలపై ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాబోయే మార్చి 20న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి కనీసం 15 శాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒక రాష్ట్ర అభివృద్ధి విద్యపై ఆధారపడి ఉంటుందని, విద్యను బలోపేతం చేయకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా విద్యాశాఖకు ఇప్పటి వరకు పూర్తిస్థాయి మంత్రి నియామకం జరగకపోవడం వల్ల విద్యారంగానికి సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. అందువల్ల వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించి విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేదంటే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కందుకూరు నగర కార్యదర్శి గంగవరం వినయ్, స్పోర్ట్స్ కన్వీనర్ మణి, డిల్లీ జశ్వంత్ లు పాల్గొన్నారు.




