29-06-2025 07:56:55 PM
- పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చిన విద్యార్థినులు
- గురుకుల బాలికల పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
మునుగోడు (విజయక్రాంతి): ప్రభుత్వం విద్యని బలోపేతం చేసేందుకు ఎన్నో నిధులను ఖర్చు చేస్తుందని అయినా విద్యార్థుల నుండి భోజనం సరిపడా పెట్టడం లేదని ఫిర్యాదు అందుతుందని ఇది మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA Komatireddy Rajagopal Reddy) సంబంధిత వారిని హెచ్చరించారు. ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి(DCCB Chairman Kumbham Srinivas Reddy)తో కలిసి మునుగోడు పట్టణంలోని కమ్మ గూడెం గురుకుల హాస్టల్ను సందర్శించి మాట్లాడారు. తల్లిదండ్రులు రావడంతో హాస్టల్ గేటు ముందు పెద్ద సంఖ్యలో ఉండడాన్ని చూసి అటుగా వెళుతున్న ఎమ్మెల్యే వాహనాన్ని ఆపారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు పిల్లల్ని కలవడానికి అనుమతి ఉండడంతో తల్లిదండ్రులు అందరు గేటు దగ్గర ఎదురుచూస్తున్నారు. పాఠశాలలోకి వెళ్లి 1:00 గంటకి లోనికి అనుమతి ఇవ్వండని డ్యూటీ టీచర్స్ చెప్పారు. విద్యార్థినిలు నీరు రావడంలేదని, భోజనంలో సరిపడా పెట్టడం లేదని కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నీటి సమస్య ఎందుకు వస్తుందని డ్యూటీ డాక్టర్స్ అడగడంతో విద్యుత్ సరఫరా సరిగా లేదని చెప్పారు. వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి సమస్య లేకుండా చూడాలన్నారు. మెస్ కాంట్రాక్టర్ ను క్వాలిటీతో సరిపడా భోజనం పెట్టాలని హెచ్చరించారు.